బాకీ
పాలేరు ఎర్రబాబు గొడ్లకు గడ్డి వేస్తూ,గేటు తీసిన అలికిడైతే తలెత్తి చూశాడు.ఓ అపరిచితుడు
లోపలికి వచ్చి అడిగాడు ,
" మీ అయ్యగారు ఉన్నారా ? "
ఎర్ర బాబు అనుమానంగా అడిగాడు ,
" మీరే పని మీద వచ్చారు ? "
" ఆయనతో బాకీ గురించి మాట్లాడాలి "
" అయ్యగారు పొద్దున్న ఆరింటికి పొలం వెళ్లారండీ "
" ఆయన లేరా , బాకీ తీరుద్దామని వచ్చానే "
" ఏడింటికల్లా అయ్యగారు ఇంటికి తిరిగొచ్చారండి.ఉండండి,కబురు చెబుతాను ఆయనకి "
పలికాడు ఎర్ర బాబు .
సొంత నవ్వు
నా నవ్వుని ఎక్కడో పారేసుకున్నాను .నిజమేనండీ , అచ్చంగా ,అక్షరాలా నా సొంత నవ్వుని
ఎక్కడో పారేసుకున్నాను .రకరకాల నవ్వులని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను .భర్త నవ్వు ,
తండ్రి నవ్వు ,ఫ్రెండ్ నవ్వు ,బాసు నవ్వు ,దాసు నవ్వు ,ఇలా ఎన్నో జేబులో ఉన్నాయి .శతకోటి
బంధాలకు , అనంతకోటి నవ్వులు . ఆ కోటిలో "నాకోటి " ఉందా ?. ఏమో , పక్క వీధిలో
పోగొట్టుకున్న కాసు,వెలుగున్న ఈ వీధిలో దొరుకుతుందా?.ఇంతకీ నా నవ్వు ఏమైంది ?.
తెలియని వెతుకులాట , తెలివిడి కోసం సాగుతోంది . నాకో అనుమానం .తెలివిడి వల్ల ఆనందం
పెరుగుతుందా ? లేక అజ్ఞానం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా ? లేక ఎదుటివాడి అజ్ఞానం
మనకి నవ్వునిస్తోందా ? రసాభాస (అనుకున్నది జరుగక చతికిలపడితే జరిగేది ) నవ్వుకి
కారణమా ? . ఏం జరుగుతోంది ఇక్కడ , నవ్వు గురించి ఆలోచిస్తూ నన్ను నేను మరిచాను.
ఇంతకీ నా నవ్వు ఎక్కడ , ఇప్పుడే తెలియాలి . ముగ్గు వేసి అంజనం వేయించనా ? ,చిలక
ప్రశ్న అడగనా ? ,వత్తులు వేసిన కళ్లు కాచేలా ఎదురు చూడనా ? .స్వామీజీ ఎవరైనా
దొరుకుతారా ?, నెట్ బదులిస్తుందా ?
ఏదో వెలుగు దగ్గరౌతోంది .వెలుగుతో పాటు ఓ మధుర స్వరం వినిపిస్తోంది
బంధువువా? నిన్నునీవు మరిచావే.అద్దె నవ్వుల సవ్వడిలో తానున్న నీ సొంతనవ్వుని చూడవే?
బ్లాగు అద్దెకు ఇవ్వబడును
నవ్వులాట బ్లాగు అద్దెకు ఇవ్వబడును ,దానికి వలయు షరతులు :
౧. ఈ బ్లాగు నందు సంసార పక్షమైన జోకులు మాత్రమే రాయవలెను. ఇతరములు
రాసినా జోకులుగానే జమకట్టబడును .
౨. రోజుకు కనీసం వెయ్యి హిట్లు , పది కామెంట్లు రావలయును. లేకున్నఅద్దె అడ్వాన్స్
తిరిగి చెల్లించబడదు.
౩. చివరిది , కానీ ముఖ్యమైనది ఏమిటంటే , మీరు రాసిన రాతలు నా పేరు తోనే
ప్రకటించబడును .మీరు అజ్ఞాతలు గానే ఉండి ఆనందించవలెను
పద చిత్రాలు
నీ జ్ఞాపకాలలో
నా బుర్ర
.... ఖాళీ గా ఉంది .అందుకే జోకులు రాయట్లేదు .తెలుగు వాడిని కాబట్టి పక్కన వారి
బుర్రలు అరువు తెచ్చుకోను ,వాళ్ల బుర్రల్ని నమ్మను కాబట్టి .కాబట్టి ఇది చదివిన
వారందరూ నా బుర్ర లో నవ్వుల ముడి సరుకు ఉంచమని దేవుడిని కోరండి...
దురద సూత్రములు
౨. దురద పుట్టినపుడే గోక్కోవాలి
౩. గోక్కున్న చోట మళ్ళీ దురద పుడుతుంది
ఇవి బ్లాగు రాతలకు వర్తిస్తాయి ,షేర్లకు వర్తిస్తాయి ,జీవితం లోని అన్నింటికి వర్తిస్తాయి .
నాకు తెలుగు బ్లాగులను చూసిన తరువాత తెలుగులో జోకులు రాయాలని దురద పుట్టింది.
అదీ బ్లాగుల్లోనే రాయాలని పించింది . బాగా గోక్కున్నాను ,ఒక సంవత్సరం ఆపకుండా రాసి
ఒక రికార్డ్ తయారు చేసుకొన్నాను .ఒకసారి ఆగి చూసుకున్నాను,ఈ నెల మొదట్లో.నా జోకులు
రాశి ( శిరా ని తిరగేస్తే వస్తుంది .శిరా ఎక్కువ వాడితే రాశి పెరుగుతుంది ) లో ఎక్కువా ?,
వాసి (వాసనకి దగ్గరగా ఉండే పదం) కూడా ఉందా అని అనుమానం వచ్చింది .సరే ,
ఆచరణ లో చూస్తే పోలా అని అనిపించి నాలుగవ తారీఖునుండీ దూరంగా ఉండిపోయాను.
ఏమో మరి మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతానో ,దైవాధీనం నవ్వులాట ...........................
భోజనం
ఆదివారం ఉదయాన న్యూస్ పేపర్ చదువుతూ ఆదినారాయణ పెరట్లోని భార్యతో అరిచి చెప్పాడు,
"ప్రియా ! ఇవాళ మా కొత్త కొలీగ్ చిరంజీవిని మనింటికి మద్యాహ్నం భోజనానికి పిలిచానే "
అదివిన్న శ్రీప్రియ వరండా లోకి ఉరికి భర్తతో అంది ,
" ఎవరి నైనా భోజనానికి పిలిచేముందు నాతో ఒక ముక్క ముందే చెప్పమన్నానా ,లేదా ?
ఇల్లు చూశారా , ఎంత దరిద్రం గా ఉందో , ఇల్లంతా విడిచిన బట్టలు , సింక్ లో అంట గిన్నెలు ,
రంగి రాక మూడు రోజులయ్యింది, ఇంట్లో కురలేవీ లేవు .అసలే పని తెమలక చస్తుంటే
ఈ తద్దినం తెచ్చి పెట్టారు మీదకి "
"తెలిసే పిలిచాను , ఆ వెధవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు,చూసి మారతాడని "
లక్షాధికారి
రాజు షేర్స్ కంపెనీ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే పానకాలరావు , దామోదరం ఇంటికి
వెళ్ళాడు , తమతో అకౌంట్ తెరిస్తే ఎంత లాభమో చెప్పటం మొదలు పెట్టాడు ,
" సార్, మీరు మా సలహాలు విని షేర్లు కొనండి . ఖచ్చితం గా మీరు లక్షాధికారి అవుతారు ,
రెండేళ్ళలో "
అది విని దామోదరం కోపంగా లేచి చాచి పానకాల రావు ని లెంపకాయ కొట్టి "గెటౌట్ "
అన్నాడు .
చెంప తడుముకుంటూ పానకాల రావు దీనంగా అడిగాడు ,
" ఎందుకు సార్ కొట్టారు ? "
" నేను ఇప్పటికే కోటీశ్వరుడిని , నన్ను లక్షాధికారిని చేస్తావా ? "అంటూ మళ్ళీ కొట్టబోయాడు
దామోదరం .
ఏడుపు
హరి పిల్లి చనిపోయింది .దాంతో హరి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు .అది చూసి పక్కింటి దినేష్
ఒదార్చ సాగాడు .
"దాని కోసం నువ్వు ఎందుకు ఇంతలా ఏడుస్తావు ? , నన్ను చూడు , మా తాతయ్య చనిపోయాడు
నిన్న ,మరి నేనేమన్నా ఏడుస్తున్నానా ? "
" మీరు మీ తాతయ్య ని పెంచలేదు కదా ! , నేను ఈ పిల్లి ని పెంచాను "
లెక్క
లెక్కల మాస్టారు పరశురాం గారు పిల్లలకు రోజూవారి ఉదాహరణలతో పాఠం చెబుతున్నారు ,
రెండో తరగతి పిల్లలకు .
" ఏరా గోపీ ! చెప్పు , మా ఇంట్లో పది గేదెలు ఉన్నాయి,వాటిలో నాలుగు గేదెలు నీకిస్తే
ఏమౌతుందో చెప్పు "
" నేను చదువు ఆపేసి వాటిని మేపాల్సి వస్తుంది మాస్టారూ "
ఉద్యోగం
డిటెక్టీవ్ యుగంధర్ ,తన దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేస్తున్నాడు .చురకత్తుల
సీతాపతి రావు ఇంటర్వ్యూ కి వచ్చాడు .
యుగంధర్ కొన్ని ప్రశ్నల తరువాత అడిగారు ,
" మహాత్మా గాంధీని ఎవరు చంపారు ? "
ప్రశ్న విన్న సీతాపతి ఆనందం తట్టు కోలేకపోయాడు .దిగ్గున కుర్చీలోంచీ లేచి యుగంధర్
గారికి బలంగా షేక్ హ్యాండ్ ఇచ్చి,
" మీరు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు .గాంధీ ని ఎవరు చంపారో నేను
తప్పక కనుక్కుంటా సార్ " అన్నాడు .
జైలు
బోనులో ముద్దాయి రాజన్న ని ప్రశ్నిస్తున్నాడు జడ్జ్ ,
" నువ్వు వారం క్రితం జైలు నుండీ తప్పించుకొని ఎందుకు పారిపోయావు ? "
" అప్పుడు రంగి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తోంది , అందుకని "
" అయితే , మరి నువ్వు నిన్న ఎందుకు లొంగి పోయావు ? "
" నాకు స్వాతంత్రం కావాలనిపించి " చెప్పాడు రాజన్న
సహాయం
పని మనిషి షర్మీలా ఒగరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యకాంతం తో చెప్పింది ,
" అమ్మగారూ , మన సందు చివర , ఎవరో ముగ్గురు ఆడవాళ్ళు మీ అత్తగారిని
కొడుతున్నారమ్మా "
సూర్యకాంతం దిగ్గున లేచి షర్మీలాతో పాటు అక్కడికి పరిగెత్తింది . అక్కడి విషయం చూసి
అలాగే నిలబడిపోయింది .
" అమ్మా ! వెళ్లి సహాయం చేయండి " అంది ఆదుర్దాగా షర్మీలా
" నా సహాయం అక్కర లేదు , వాళ్ల ముగ్గురూ చాలు " అంది సూర్యకాంతం తాపీగా
నవ్వుల చిలకలు
ప్రశ్న : ఆశ్రమం లో పాలు తాగుతున్న బ్రహ్మచారి చనిపోయాడు ,ఎందుచేత ?
జవాబు : ఆవు హటాత్తుగా కూర్చోవటం వల్ల
*********************************************************************
శివ : అసాధ్యం అనేమాట నా నిఘంటువు లోనే లేదు
అవ్వ : కొనేటప్పుడే చూసుకోవాల్సింది. పుస్తకాల దుకాణం వాడు కొత్త పుస్తకం ఇస్తాడో ,లేదో ?
*********************************************************************
అడవి అంటుకుంది
నల్లమల అడవి లో ఓ మండు వేసవి కాలం చెట్ల రాపిడి వల్ల మంటలు రాజుకున్నాయి .అడవి
తగలపడి పోతోంది. దాన్నిచిత్రీకరించటానికి, తక్షణ వార్తా ప్రసారానికి కవి కిషోర్ వెళ్ళాడు .
కానీ అంతా పొగతో నిండిపోవటంతో సరిగా చిత్రీకరణ కుదరటం లేదు .వెంటనే ఆఫీసు కి
ఫోను చేసి తనకు ఒక హెలీకాఫ్టర్ కావాలన్నాడు .వాళ్లు అక్కడికి దగ్గరున్న గుట్ట మీద
పావుగంట లో హెలీకాఫ్టర్ ఉంటుందని చెప్పారు .
కవికిషోర్ గుట్ట దగ్గరికి ఆయాసపడుతూ జేరి ,అక్కడ సిద్దంగా ఉన్న హెలీకాఫ్టర్ ఎక్కి పైలెట్ కి
సూచనలు ఇచ్చాడు ,
" నువ్వు అలా ఉత్తరం వైపుకి పోనీయ్ , అక్కడ బాగా తగలబడుతున్న చోట కిందకి దింపు .
నేను వీడియో బాగా తియ్యాలి "
హెలీకాఫ్టర్ గాలిలోకి లేచింది .తగలబడుతున్న అడవి నడి నెత్తికి ఎక్కింది .అప్పుడు పైలెట్
అడిగాడు అనుమానంగా ,
" సార్ , మీరు వీడియో తియ్యాలంటున్నారుఎందుకు సార్ ? "
" నేను టీవీ 47 విలేఖరిని .వీడియో కాక ఏం తీస్తాను " విసుక్కోన్నాడు పైలెట్ పై కవికిషోర్
"మీరు మా పైలెట్ ట్రైనింగ్ ఆఫీసర్ కాదా ? " అడిగాడు పైలెట్ ఆందోళనగా
భయం
డాక్టర్ పూర్ణచంద్ ని , తొలి రాత్రి కబుర్లలో అడిగింది ,కొత్త పెళ్లి కూతురు కాత్యాయని ,
" ఏమండీ , మీ డాక్టర్లు , కొద్ది సీరియస్ కేసులకు కూడాఎరయై నాలుగు గంటలలో
ఆపరేషన్ చెయ్యాలని చెబుతుంటారెందుకు ? "
" దీంట్లో గొప్ప తర్కమేమీ లేదు , మేము ఒకవేళ రోగిని అలా వదిలేస్తే , వాడికి
మామూలు గానే తగ్గిపోతుందని మా భయం" నిజాయితిగా భార్య కు బదులిచ్చాడు పూర్ణచంద్
తెల్లగోడ
మహర్షి సదానందుల వారి ఆశ్రమం . ఈ మధ్యనే ఆశ్రమం లోని గోడలకు తెల్ల సున్నం వెల్ల
వేయించారు . వారికి ఇద్దరు శిష్యులు .ఒకరు శుకుడు ,అతనిది జ్ఞాన మార్గం .
మరొకరు రామదాసు, భక్తి మార్గానుయాయి .
ఒకరోజు ఉదయాన్నే శుకుడు ఆశ్రమం లోని తెల్లని గోడపై " సోహం " (అదే నేను ) అని
బొగ్గు తో రాసాడు . కాసేపటి తరువాత ఆ దారిన వెళుతున్న రామదాసు సోహం ముందు
"దా " కలిపాడు బొగ్గుతో .దాంతో ఆమాట " దాసోహం "(భగవంతునికి దాసుడను ) అయ్యింది .
ఆ తరువాత శుకుడు " స " కలిపాడు . ఈ సారి తన వంతుగా రామదాసు " దా " కలిపాడు .
అలా శుకుడు " స " ని , రామదాసు "దా " ని కలుపుతూ వెళ్ళారు . వారు బొగ్గు తో కొత్త
అక్షరం కలిపిన ప్రతిసారీ కొత్త కొత్త పదాలు , కొత్త అర్ధాలు పుట్టుకొచ్చాయి .
అవి :" సోహం " ,"దాసోహం " ," సదా సోహం " ," దాస దాసోహం ", సదా సదా సోహం ".
ఈ విషయాన్ని అంతా గమనించిన సదానందుల వారు ,శిష్యులిద్దరినీ పిలిచి చెప్పారు ,
"నాయన లారా , మీ పోటీలతో మీరు మసిబొగ్గుతో తెల్లని గోడని ఎందుకు పాడు చేస్తారు ?,
మీ మనసు మలినాలు అంటని తెల్లని గోడ లా ఉంటే ఏ మార్గమైనా మంచిదే .అలా కాక
మసిబొగ్గు పూసిన గోడలాగా ఉంటే అందులో జ్ఞానం గానీ , భక్తిగానీ ఏవీ నిలువవు "
అంతా నారాయణుడే
ఒక గురువు గారు తన శిష్యులతో అడవి గుండా పయనమై వెళుతున్నారు. వారి ఉపదేశం
ఇలా సాగుతోంది ,
" ఈ ప్రపంచంలోని ప్రతిదీ నారాయణ స్వరూపమే .నీలోనూ నారాయణుడు ఉన్నాడు ,
నాలోనూ నారాయణుడే ఉన్నాడు .పరమాణువు నుండీ పరమాత్మ వరకు అంతా
నారాయణుడే నిండి ఉన్నాడు .అందుచేత అన్ని జీవుల యందు సమ దృష్టి కలిగి ఉండాలి "
శిష్యులందరూ శ్రద్ధగా వింటూ నడుస్తున్నారు .ఇంతలో ఒక ఏనుగు భయంకరం గా ఘీంకరిస్తూ
అడవినంతటినీ అతకుతలం చేస్తూ వీరి వైపు దూసుకు రాసాగింది .
గురువు తో సహా అందరు శిష్యులూ పరుగెత్తి ఏనుగు బారిన పడకుండా దూరంగా దాక్కొన్నారు.
కానీ ఒక శిష్యుడు మాత్రం ఏనుగు కు ఎదురుగా అలాగే నుంచుని ఉండిపోయాడు.ఏనుగు అతన్ని
తొండంతో పట్టుకొని దూరంగా విసరివేసింది .ఏనుగు అక్కడ నుండీ వెళ్ళిన తరువాత మిగిలిన
శిష్యులు , గురువు గారు అతని చుట్టూ చేరి సపర్యలు చేశారు . కొంత తేరుకున్న అతను గురువు
గారిని అడిగాడు ,
"అయ్యా , మీరు అంతా నారాయణ స్వరూపమే అని చెప్పారు , నాలోనూ, ఏనుగులోను
నారాయణుడే ఉన్నపుడు ఏనుగు నన్ను ఎందుకు ఇలా చేసింది ? "
అప్పుడు గురువు గారు ఇలా బదులిచ్చారు ,
"నాయనా , నేను చెప్పింది నిజమే .నీలోను , ఏనుగు లోను నారాయణుడే ఉన్నాడు .నువ్వు
ఈ రెంటినే చూశావు .కానీ ఏనుగు వెనుక నుండీ "పారిపొండీ ,పారిపొండీ " అంటూ అరిచిన
మావటి నారాయణుడి మాటలు నీ చెవికెక్కలేదు . అందుచేతే ఇలా జరిగింది ."
(హిందూ వేదాంతము నుండీ గ్రహించబడినది )
షికారు
పరమపీనాసి పానకాలరావు, తన వయసొచ్చిన కొడుకు ఎవరో అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని
ఫైవ్ స్టార్ హోటల్ లోకి వెళ్ళటం చూశాడు .వాడు రాత్రికి ఇంటికి రాంగానే గుమ్మంలోనే
నిలేశాడు .
" ఏరా, ఎవత్తినో ఎక్కించుకొని ఫైవ్ స్టార్ హోటల్ లో దూరావు.డబ్బులెంత తగలేసి చచ్చావు?"
" ఐదువేలు నాన్నా "
" ఐదు వేలా ? " గుండె పట్టుకొన్నాడు పానకాలరావు .
" ఏం చెయ్యను నాన్నా , ఆ అమ్మాయి దగ్గర అంతే ఉంది మరి " చెప్పాడు పుత్రరత్నం .
నాస్తికుడు
మణిరత్నం బుర్ర మీసాలతో ,ఎర్ర కన్నులతో ఒక చిన్న సైజు రాక్షసుడిలా ఉంటాడు.
రమా బాల విద్యా మందిరం పిల్లల దురదృష్టం కొద్దీ , ఆయన వాళ్ళకి టీచరుగా
వచ్చాడు . ఒక రోజు క్లాసులో ,
" నేను నాస్తికుడిని. మీరు కూడా నాస్తికులేనా ? " అడిగాడు గంభీరమైన గొంతుతో
పిల్లల్ని .
పిల్లలకి నాస్తికుడు అంటే ఏమిటో తెలియదు .తాము కాదంటే ఏమంటాడో అని భయం.దాంతో
అందరి చేతులు ఒక్కసారిగా నింగికెగసే తారాజువ్వలలా పైకి లేచాయి . ఒక్క పిల్లవాడు
మాత్రం చెయ్యి ఎత్తలేదు .మణిరత్నం అడిగాడు వాడిని ,
" హరీ !నువ్వు నాస్తికుడివి కాదా ? "
" లేదు నేను నాస్తికుడిని కాదు , నేను హిందువుని "
" నువ్వు హిందువు వి ఎట్లా అయ్యావు ? "
" మా అమ్మ , నాన్న హిందువులు . వాళ్ళకి నేను పుట్టాను కాబట్టి హిందువునే "
" అది సరి కాదు . మరి మీ అమ్మ మూర్ఖురాలు,మీ నాన్న మూర్ఖుడు అయితే,
నువ్వు మూర్ఖుడివి అవుతావా ? " గద్దించాడు మణిరత్నం
" కానండి , అప్పుడు నేను నాస్తికుడిని అవుతాను " చెప్పాడు తొణక్కుండా హరి
సిగ్గు
అరవింద్ పనిపడి ఓ చిన్న టౌన్ కు వెళ్ళాడు. అక్కడ ఆకలేసి ఒక కాకా హోటల్ లో దూరి
భోజనం తెమ్మన్నాడు. భోజనం తెచ్చిన కుర్రాడి ముఖం లోకి చూస్తే ఏదో గుర్తొచ్చింది .కొంచం
పరిశీలనగా చూస్తే వాడు చిన్నప్పటి తన స్నేహితుడు గోపీ అని తట్టింది .వాళ్ల నాన్న వాడిని
" వేటగాడు " సినిమాచూసినందుకు కొడితే , ఇంటి నుండీ పారి పోయాడు .
అరవింద్ అడిగాడు ,
"ఏరా గోపీ , ఇట్లాంటి చోట పని చేయటానికి నీకు సిగ్గు అనిపించటం లేదూ ? "
"పనిచేయటానికి నేనేమి సిగ్గు పడటం లేదు, కానీ ఇలాంటి చోట భోజనం చేయటానికి మాత్రం
బాగా సిగ్గు పడతాను " చెప్పాడు గోపీ మనసులో మాట
కాడ్బరీస్ చాక్లెట్
రాత్రి భోజనం కడుపునిండా తిని భుక్తాయాసం తీర్చుకోవటానికి కాలనీ లో నడవటం
మొదలు పెట్టాడు నాగేశ్వరరావు. ఓ దీపస్థంభం క్రింద దేనికోసమో వెతుకుతూ కనిపించాడు
మిత్రుడు పరాంకుశం .
" అంకుశం , దేని కోసం వెతుకుతున్నావు ? "
" కాడ్బరీ ఫైవ్ స్టార్ చాక్లేట్ పడిపోయిందిరా "
" మనవడి కోసం కొనుక్కొని వెళుతున్నావా ? "
" లేదు , నేనే తింటూ వెళుతున్నా "
" డెబ్బై ఏళ్ళు వయసొచ్చి చాక్లెట్ తినటమేమిటీ ,కింద పడిపోయిందని వెతకటమేమిటీ,
నువ్వు మారవేరా ఎప్పటికీ ? "
" నేను వెతుకుతున్నది దాని కోసం కాదురా , దానిలో నా పళ్ళ సెట్టు ఇరుక్కొని
పడిపోయింది .దాని కోసం వెతుకుతున్నా "
సేల్స్ మాన్
రైళ్ళలో చిరుతిళ్ళు అమ్మటానికి మంచి తెలివి తేటలు , అనుభవం కల్గిన వ్యక్తులను ఎంపిక
చేస్తున్నాడో వ్యాపారి ,
వ్యాపారి : నీ పేరేమిటి ?
అభ్యర్ధి : వెంగళరావు
వ్యాపారి : నీకు అనుభవం ఉందా ?
అభ్యర్ధి : ఐదేళ్ళు నుంచీ ఈ పనిలో ఉన్నాను , కోస్తా లో అమ్మాకాలలో నేనే ఫస్ట్
వ్యాపారి : సరే , ఈ సంచీలో జీళ్ళు, ఆ సంచీలో బఠానీలు తీసుకెళ్ళి అమ్ముకురా .
అభ్యర్ధి : అలాగేనండీ
ఓ అరగంట తరువాత వెంగళరావు నీరసంగా రెండు సంచులు నిండుగా పట్టుకొని
తిరిగి తెచ్చాడు .అప్పుడు
వ్యాపారి : ఏరా, నువ్వు పోటుగాడిని అన్నావు , ఏం అమ్మలేక పోయావు ?
అభ్యర్ధి : నేను మీకు పొరపాటు చెప్పాను , నేను అమ్మటం లో రెండో వాడిని .
మీకు ఇవి అమ్మినవాడు మొదటివాడు నిజంగా .
దేవుడు లేడు
మహా శివరాత్రి నాడు , ఉరి మధ్య నున్న శివాలయం లో ,
" ఏరా రాఘవా ! నువ్వు ఈ మధ్య హేతువాదులతో చేరి దేవుడు లేడని అంటున్నావట,
నిజమేనా ? "
రాఘవ మాట్లాడలేదు. సుధాకర్ మళ్ళీ అడిగాడు ,
" ఇంతకీ నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా , లేదా ? "
రాఘవ మౌనంగా అక్కడనుండీ వెళ్లి పోయాడు . మరునాడు కూరల సంత లో కలిసాడు.
సుధాకర్ , రాఘవ ని నిలదీశాడు ,
" ఏరా , నిన్న నేనడిగిందానికి సమాధానం చెప్పకుండా వెళ్లి పోయావే ,ఇంతకీ నువ్వు
దేముడున్నాడని నమ్ముతున్నావా లేదా ? "
"నాకైతే నమ్మకం లేదు "
" మరి ఈ ముక్క నిన్ననే చెప్పచ్చు కదా ? "
" శివరాత్రి నాడు,ఆలయం లో దేవుడి ఎదుట నుంచుని ఆ మాట ఎలా చెప్పమంటావయ్యా ? "
డిన్నర్
రాఘవ రావు , లక్ష్మీపతి ఇంటికి మిట్ట మధ్యాహ్నంఅప్పుడు వెళ్ళాడు .వాకిట్లోంచీ కేకవేసాడు,
" లక్ష్మీపతీ , ఏం చేస్తున్నావు " అని
మూడేళ్ళ లక్ష్మీపతి పాప బయటకి వచ్చి ,
"అంకుల్ , నాన్న డిన్నర్ చేస్తున్నారు " అంది
" పాపా , నాన్న చేసేది లంచ్ , డిన్నర్ కాదు " అని అన్నాడు రాఘవ .
" మా నాన్న ఇప్పుడు తింటున్నది నిన్న రాత్రి వండిన అన్నమే అంకుల్, అందుకే అలా చెప్పాను"
విడాకులు వద్దు
సూరి , సుబ్బమ్మల విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది . జడ్జ్ గారు సుబ్బమ్మని అడిగారు ,
"సుబ్బమ్మా ! నువ్వు ఇంతకు ముందు వాయిదాలోనీ భర్త తో తెగతెంపులు చేసుకుంటానని
గట్టిగా చెప్పావు , ఇప్పుడేమో విడాకులు వద్దు , భర్తతో నోరు మూసుకొని కాపురం చేస్తాను
అంటున్నావు , ఎందుకు ఇంత మార్పు వచ్చింది ? "
" గత వారం మా ఇంట్లో టీవీ చెడిపోయింది . దాంతో సూరి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో
అర్ధమయ్యి బుద్ది వచ్చింది. "
హోటల్ బిల్లు
చిదంబరం , ఏకాంబరం కలిసి బేపార్క్ హోటల్ కు వెళ్ళారు .కడుపు నింపుకొని చేతులు
కడుక్కొంటూ చిదంబరం అన్నాడు ,
" అన్నా ,మనం ఎన్నిసార్లు హోటల్ కి వచ్చినా నువ్వే బిల్లు కడుతున్నావు.నాకు సిగ్గుగా
ఉంటోంది . ఈ సారి నేను ... "
" ఏంటీ, మన బిల్లు నువ్వు కడతావా ? " అచ్చెరువొందాడు ఏకాంబరం
" నా వాటా బిల్లు నేనే కట్టుకుంటాను "
క్షమ
వహిల్వాన్ భీమారావుని,పక్కింటాయన పలకరించాడు ,
" ఏం భీమారావు, వారం క్రితం నిన్ను ఘోరంగా పది మందిలో అవమానించిన ఆ సీతాపతిని
క్షమించి వదిలేశావని విన్నాను , నిజమేనా ! , అలా ఎందుకు చేశావు ? "
" వాడు నా కన్నా బలవంతుడు కాబట్టి " చెప్పి లోపలికి వెళ్లి పోయాడు భీమారావు .
మాతృ భాష
హరి వాళ్ల నాన్న ని అడిగాడు ,
" నాన్నా,మనం మాట్లాడే భాషని మాతృ భాష అంటారు, కానీ పిత్రు భాష అని ఎందుకు అనరు?"
" ఎందుకంటే , ప్రతి ఇంట్లో తల్లులే మాట్లాడు తుంటారు కాబట్టి "చెప్పాడు ఆ అనుభవజ్ఞుడు
జాతి గౌరవం
సైంధవ దేశం వారికి తామూ గొప్ప యుద్ధ వీరులమని గర్వం .దానికి తగ్గట్టు వారు చాలా
యుద్దాలలో గెలిచారు.విశాల దేశం వారితో యుద్ధంలో వారి ఖర్మ కాలి కాలికి బుద్ది చెప్పవలసిన
అవసరం పడింది వారికి .వారు అలా వెనుతిరిగి పారిపోతుండగా , వెనకనుండీ ఉపసేనాధిపతి,
సేనాధిపతికి అరిచి చెప్పాడు ,
" నేను విశాల దేశం సైనికులను ఐదుగురిని పట్టుకున్నాను, నాకు సహాయం చేయండి "
"మంచిది , వెంటనే వాళ్ళని నా ముందుకి లాక్కోనిరా "
"వాళ్లు రావటం లేదు , నువ్వే రావాలి "
" మనం ఆగటానికి వీల్లేదు,వాళ్ళని వదిలి పెట్టి నువ్వు వచ్చేయి "
"నేను వదిలినా వాళ్లు నన్ను వదలటం లేదు " అరిచి చెప్పాడు ఉప సేనాధిపతి .
టీవీ గది
క్రొత్తగా కాపురానికి వచ్చిన సుధకు , తన ఇంటి లోని గదులన్నీ చూపిస్తున్నాడు గంగాధర్ .
" సుధా , ఇది వరండా , ఇది హాలు , ఇదేమో టీవీ గది , ఇదిగో ఇది వంట గది "
" మరి టీవీ గదిలో టీవీ లేదు , కొత్తది కొనాలా " అడిగింది సుధ .
గంగాధర్ , సుధ చేయి పట్టుకొని టీవీ గదిలోకి తీసుకెళ్ళి చూపించి చెప్పాడు ,
"ఇదిగో , ఈ కిటికీ నుండీ చూస్తే పక్కింటి వాళ్ల టీవీ చక్కగా కనిపిస్తుంది "
దెయ్యం
సుమంత్,వాళ్ల నాన్న రావటం చూసి పరిగెత్తుకంటూ ఎదురు వెళ్ళాడు
" నాన్నా , నువ్వెప్పుడైనా దెయ్యాన్ని చూశావా ? "
" ఆ విషయం నీకెందుకురా ఇప్పుడు ? "
" మా క్లాసు lo శేఖర్ వాళ్ల నాన్న నిన్న రాత్రి చీకట్లో వస్తుంటే మర్రి చెట్టు దగ్గర
దెయ్యాన్ని చూశాడట .వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు "
అప్పుడు సుమంత్ చెవిలో చెప్పాడు వాళ్ల నాన్న ,
" రేపు మీ క్లాసు లో, మా నాన్న దెయ్యాన్ని చూడటమే కాదు ,దాంతో పదేళ్ళ నుండీ
కాపురం కూడా చేస్తున్నాడని చెప్పు "
వెంట్రుకలు
*
పరంధామయ్య మంచి ఆకలితో వచ్చి భోజనం ముందు కూర్చొన్నాడు .కంచం వంక చూసి ,
వెంటనే పట్టరాని కోపం తో భార్యపై అరిచాడు ,
"దేబ్యం మొహమా , నికేన్ని సార్లు చెప్పానే ,కళ్ళజోడు పెట్టుకొని వంట చేయమని ,కూర, పప్పు
నిండా అన్నీ వెంట్రుకలే "
"నేనూ మీకేన్ని సార్లు చెప్పాను ? కళ్ళజోడు లేకుండా అన్నానికి రావద్దని , అవి కొత్తిమీర
కాడలు ,చూసి ఏడవండి "
డబ్బు గోల
మా పక్కింట్లో నుంచీ ఈ రోజు సాయంత్రం ఈ మాటలు వినపడ్డాయి ,
"ఎప్పుడు డబ్బు , డబ్బు అని నా ప్రాణం తీస్తావేమిటే, ఒక్క రోజన్నా మంచి జ్ఞానం కావాలనో
బుద్ధి కావాలనో అడగవేమిటే
" ఎవరి దగ్గర ఏది ఉంటే అదే అడుగుతాము ,లేనిది అడిగి ఏమి లాభం ? "
ఆ తరువాత నేను మా ఆవిడని తప్పించుకు తిరిగాను , నా మీద స్వంత వాక్యాలలో
ప్రయోగిస్తుందేమోనని .
ఆలస్యం
స్కూల్ బెల్లు మోగింది .క్లాసులు మొదలై అరగంట అయ్యింది . మహేష్ బాబు పరిగెత్తుకుంటూ
నాలుగవ తరగతి రూం ముందు తలుపు దగ్గర ఆగిపోయాడు. మాస్టర్ గారు చూసి అడిగారు ,
"ఏరా ఎందుకు లేటు అయ్యింది ? "
" వస్తుంటే దారిలో ఒకాయన వెయ్యి రూపాయల నోటు పడిపోయింది. అందరూ వెతుకుతుంటే
అక్కడే ఉండిపోయాను."
" స్కూల్ ఉందని మరిచిపోయావా , బుద్దిలేని వెధవా "
" లేదు మాస్టారూ , ఆ వెయ్యి నోటు నా బూట్ క్రింద ఉండి పోయింది " నసిగాడు మహేష్ .
తాళి
రాము : సోమూ,నీకు ఎప్పుడూ పరీక్షల్లో అత్తేసరు మార్కులు వచ్చేవి గదా ?,
మరేంటి క్వార్టర్లీ లో అన్నింటిలో మంచి మార్కులొచ్చాయి !
సోము : మన హెడ్ మాస్టర్ గారితో , మా అక్క పెళ్లి ఖాయమయ్యింది క్రితం నెలలో
సౌందర్యం
సంగీత : " అనితా !నీకు గొప్ప అందగత్తె కనబడితే ఏం చేస్తావు ? "
అనిత : "అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతాను.అలా చూస్తూనే ఉంటాను .
విసుగొస్తే అద్దం తీసి పక్కన పెడతాను "
నవ్వులాట సాధించెన్ అరుదైన ఘనత
నేను నవ్వులాట గా జులై 2008 లో మొదలు పెట్టిన ఈ బ్లాగు నిన్నటి
రోజున ఒక అరుదైన ఘనతని తన సొంతం చేసుకొంది.ఈబ్లాగులో నేను
03- అక్టోబర్ -2008 నుండీ నిన్నటి వరకు ఒక్కరోజు కూడా
విడువకుండా ఒక సంవత్సరకాలం ప్రతి రోజూ జోకులతో నా బ్లాగులో
టపాలని రాస్తూ వచ్చాను. నాకు తెలిసినంత వరకు ఈప్రపంచంలో ఒక
సంవత్సరకాలం ఆపకుండా తెలుగుబ్లాగులలో టపాలను రాసిన
మొదటివ్యక్తిని నేనే.
బహుశా మిగిలిన భారతీయ భాషలలో చూసినా,నేను మొదటి
నలుగురిలో ఉంటాననే అనుకుంటున్నాను.
ఈ నా బ్లాగు ఘనత నాది మాత్రమే కాదు,
నా బ్లాగు రోజూ చదివే మీ అందరిది.
మీ ప్రోత్సాహం లేకుంటే ఇది సాధ్య మయ్యేది కాదు.
నా అర్ధాంగి అన్నపూర్ణ,నా చిన్నారులు చిన్మయీ,హరి సహకారం
లేనిదే ఈ నాయాత్ర నిజంగా సఫలమయ్యేదే కాదు.
మీ అందరి అభిమానాన్ని,ఆదరణని,ఆశిస్సులను ఎల్లపుడూ కోరుకుంటూ,
మీ
నవ్వులాట శ్రీకాంత్
ఆదర్శ దాంపత్యం
రంగా రావు , రమణి దంపతుల వివాహం జరిగి యాభై ఏళ్ళు . వారి సంతానం , మనుమలు
మనుమరాళ్ళు అందరు కలిసి గొప్ప విందు ఏర్పాటు చేసారు ఆ సందర్భం లో .
ఆ విందులో "అదేదోటీవీ" యాంకర్ సురేఖ కూడా పాలుపంచుకుంది. రంగారావు దంపతులతో
ఇంటర్వ్యు ముందుగా రమణి గారిని ప్రశ్నించటం తో మొదలుపెట్టింది .
" రమణి గారూ , ముందుగా మీఇద్దరికీ నా అభినందనలు .యాభై ఏళ్ల కాలం భార్యాభర్తలుగా
ఆనందంగా,చిలకా గోరింకల్లాగా, ఇతరులకు ఈర్ష కలిగించేట్టు, చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా
కలిసి జీవించిన మీకు నా శతకోటి వందనాలు .మీరు ఏమీ అనుకోనంటే నాదో చిన్నప్రశ్న "
" అడుగమ్మా "
" మీరెప్పుడైనా ఈ యాభై ఏళ్ల కాలంలో , మీ వారికి విడాకులు ఇద్దామనుకున్నారా ? "
" లేదమ్మా , అలాంటి ఆలోచనే ఎప్పుడూ నా మనసులోకి రాలేదు.కానీ ఒక్క సారి మాత్రం
ఆయన్ని కాల్చిపారేద్దామనుకున్నా "
నిజం
కోర్టులో వాజ్యం నడుస్తోంది . ముద్దాయి బోనులో నిలబడి ఉన్నాడు . జడ్జ్ గారు అతన్ని ఇలా
అడిగారు ,
" ఏం రామయ్యా , నీ వైపు వాదించటానికి ఎవరన్నా వకీలు ని పెట్టుకోలేదా ? "
" లేదండయ్యా "
"ఏ నీకు వకీలు అవసరం లేదా ? "
" నేను నిజమే చెప్పాలనుకుంటున్నాను , నాకు ఏ వకీలు అవసరం లేదండీ " అన్నాడు
రామయ్య అమాయకంగా
ఒప్పుకోలు
విజయ్ ,మదన్ లుంబినీ పార్క్ లో పల్లీలు తింటూ మాట్లాడుకుంటున్నారు......
విజయ్ : నేను సరిత ని జీడీల పాకమంత గాఢముగా ప్రేమిస్తున్నాను.ఆమె లేక బతకలేను .
కానీ తనని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియట్లేదు .
మదన్ : ఆ లేడీ రౌడీనా?, ఈ విషయం లో నన్ను ఇరికించకు .
విజయ్ : నువ్వు నా ఫ్రెండువయితే ఓ సలహా చెప్పరా "
మదన్ : మీ ఇంటి ఎదురేగా, ఓ వంద చిల్లర ఉందేమో అడుగు ,అప్పుడు ఎవరూ
లేకుంటే నీ ప్రేమ విషయం చెప్పు
విజయ్ : నీ బోడి సలహా నిన్న ట్రై చేసి చూశాను .నా మనసులో మాట చెప్పాను .దాంతో
ఆమె నేనిచ్చిన వందని దొంగ నోటులా చూసి , కోపంగా "చిల్లర లేదు " అని
లోపలికి వెళ్లి పోయింది .
మదన్ : అలా జరిగిందా ?, అయినా నీకు 20 ఏళ్ళు, ఆమెకి 24. పర్లేదు మళ్ళీ ట్రై చేయి .
ఆమె ఒప్పుకుంటే ,ఆమె దెబ్బకి నాలుగేళ్ళలో,ఆమె కంటే ముసలాడిలా కనిపిస్తావు.
రహస్యం
ఓ ముఖ్యమంత్రి గారు, మేధావుల సభలో ప్రారంభోపన్యాసాన్ని ఇస్తున్నారు .వారి వాగ్ధాటి
ఆగకుండా సాగిపోతూనే ఉంది . ఇంతలో హఠాత్తుగా "పచ్చినిజం " దినపత్రిక విలేఖరి లేచి
ముఖ్యమంత్రి ని వేలెత్తి చూపుతూ " నువ్వొట్టి చవట దద్దమ్మ వి " అని అరిచాడు .
వెంటనే ఈ విషయం మన గొప్ప మీడియా ద్వారా ప్రపంచమంతా ప్రసారమయ్యింది
పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు . జడ్జ్ గారు విచారించి
లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
పాపం విలేఖరి జడ్జ్ గారిని ప్రాధేయపడుతూ అడిగాడు ,
" చిన్న పొరపాటు మాటకి లక్ష రూపాయల జరిమానానా సార్ "
జడ్జ్ చెప్పారు ,
" నువ్వన్న మాటకి జరిమానా పదివేలే .కానీ కాపాడ వలసిన రహస్యాన్ని ప్రపంచానికి
బయట పెట్టినందుకు మిగతా తొంభై వేలు "
రచన
హరికృష్ణ కథ "అల్లిబిల్లి" వార పత్రిక లో అచ్చు అయ్యింది .అది అతని వందో కథ,
అచ్చు అయ్యింది కాదు , ప్రచురణ కి పంపించినది.దాంతో ఆనందంగా మిత్రులకి పార్టీ ఇచ్చాడు .
పత్రిక వారి ప్రశంశా పత్రం కోసం ఎదురు చూడసాగాడు ,
ఓ నెల గడచిన తరువాత , మిత్రుడు రాజీవ్ అడిగాడు ,
" ఏరా , అల్లిబిల్లి వాళ్లు నీకు ఏమి పంపించారేమిటి బహుమతి ? "
"ఏం చెప్పనురా , నా చేతి రాత బాగు చేసుకోమని ఒకటవ నెంబర్ కాపీలు యాభై , రెండో
నెంబర్ కాపీలు యాభై పంపించారు రా "
వందేళ్లు
సంజీవరావు ని ఓ పదేళ్ళ క్రితం ఎవరో అడిగారు ,
" సంజీవరావు గారూ, మీకు ఇప్పటికి 9o ఏళ్ళు ,ఇలాగే ఆరోగ్యంగా ఎంతకాలం జీవించి
ఉండాలను కుంటున్నారు ? "
"వందేళ్ళ మూడు నెలల వరకు "
"అందరూ వందేళ్లు కోరుకుంటారు ,మీరు వందేళ్ళ మూడు నెలలు అంటున్నారు ,విశేషం
ఏమన్నా ఉందా ? "
" వందేళ్లు బతికి హఠాత్తుగా చనిపోతే బాగోదు కదా అందుకని , అంతే కాక వందేళ్లు
బతికినందుకు సన్మానాలు చేస్తారు గదా , అవి కూడా చేయించుకొని పోదామని "
నేడు సంజీవరావు గారికి సన్మానం జరుగుతోంది , వందేళ్లు పూర్తి అయిన సందర్భంలో .
సన్మానం తరువాత పత్రికా విలేఖరులు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు ,
యువత పత్రికావిలేఖరి అడిగాడు ,
"మీరు ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యం గా ఉండటానికి కారణం ఏమిటి ? "
" రాత్రి నడక , నా జీవితం లో అరవై ఏళ్ళు అలా నడిచాను "
"రాత్రి నడకా ? , అందరూ ఉదయపు నడక నడుస్తారు , మీరు విచిత్రం గా
చెబుతున్నారే "
" నిజమే , రాత్రి నడకే , నాకు , మాఆవిడకి గొడవ జరిగినప్పుడల్లా , మా ఒప్పందం ప్రకారం
తప్పు చేసిన వాళ్లు వరండాలో రాత్రంతా నడుస్తూ ఉండాలి .దాదాపుగా నేను రోజు విడిచి
రోజు అలా రాత్రి నడక నడుస్తూ అరవై ఏళ్ళు ఆమెతో కాపురం చేశాను "
లారీ డ్రైవర్
మంగళగిరి హైవే ప్రక్కన డాబా లో నులక మంచం మీద కూర్చొని పుల్కాలు తింటూ ఇద్దరు
లారీ డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారు ,
"ఒరేయ్ రాజు , మొన్న నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా "
మొదలు పెట్టాడు గిరి .
" ఏం జరిగిందేటి "
" నేను వేగంగా కోఠీ లో వన్ వే లో వెడుతున్నా ,ట్రాఫిక్ పోలీసోడు కనీసం ఆపలేదురా "
"నువ్వు అదృష్టవంతుడివి .నా దగ్గర ఆడు సరైన దారి లో వెళ్ళినా,ఎన్ని సార్లు , ఎంత గుంజాడో
లెక్కే లేదు "
"అదృష్టం లేదు , ఏం లేదు , అప్పుడు నేను పరిగెత్తుకొని వన్ వే లో వెళుతున్నా , అంతే "
పోటీ
" గంగా కెమికల్స్ "లో రిసెర్చ్ లాబ్ మేనేజర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతోంది. రెండు
రోజుల వడపోత తరువాత బరిలో కవిత ,అనిత ఇద్దరు మాత్రమే మిగిలారు.అన్నింటిలో
ఇద్దరూ సమాన ప్రతిభ చూపించారు .దాంతో చివరికి ఓ ఐదుప్రశ్నలను ఇచ్చి సమాధానాలు
రాయమన్నారు . తరువాత ....
అరగంట కు ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన అనిత ని పిలిచి చెప్పారు ,
" మీరిద్దరూ నాలుగు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసారు , మేము కవిత ను
ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము "
" సార్ ! మేమిద్దరం అన్నింటిలో సమానంగా ఉన్నపుడు కవితకి ఉద్యోగం ఇవ్వాలని
ఎలా నిర్ణయించారు ? " ప్రశ్నించింది అనిత
" మేము మీరు సమాధానం సరిగా రాయని ప్రశ్నలని బట్టి ఈ నిర్ణయం తీసుకొన్నాము "
" ఎలాగో తెలుసుకోవచ్చా ? "
"మీరిద్దరూ మూడవ ప్రశ్న కి సరైన సమాధానం ఇవ్వలేదు . కవిత సమాధానం
" నాకు తెలియదు " అని . నీ సమాధానం " నాక్కూడా తెలియదు " అని .
అర్ధం అయ్యింది అనుకుంటాను " చెప్పారు పెద్దాయన
చెరుకు గడ
చెరుకు గడలు తిని చాలా కాలం అవటం తో మనసుపడి ఓ అర్ధరాత్రి గజేంద్రుడు , అడవి
పక్కనే ఉన్న విరగపండిన చెరకు తోట లోకి తన కుటుంబం తో అడుగు పెట్టాడు .
ఆడ ఏనుగు , అతని రెండు గున్న ఏనుగులు పొలం లో పడి చెరుకు గడలను నమిలి పిప్పి
చేయసాగాయి .కానీ గజేంద్రుడు మాత్రం ఒక్క చెరుకు కూడా ముట్టుకోలేదు .
అతని భార్య అడిగింది ,
"రాజా ! ఏమైంది నీకు , ఒక్కటి కూడా ముట్టుకోలేదు ? "
గజేంద్రుడు చెప్పాడు ,
" నాకు చెక్కెర వ్యాధి ఉందని పొద్దున మన వైద్యుడు పరిక్ష చేసి చెప్పాడు "
మానవ వనరులు
కాంతిమతి గోవిందా ఇండస్ట్రీస్ లో మానవ వనరుల విభాగానికి మేనేజర్ గా పనిచేస్తోంది .
భూమి మీద నూకలు చెల్లి , ఒక యాక్సిడెంట్ లో హఠాత్తుగా ఆవిడ ప్రాణాలు పోయాయి .
ఆమె ఆత్మ పైకి వెళుతుంటే స్వర్గం-నరకంల మధ్య ఉన్నగేటు దగ్గర ఓ దేవదూత ఆపి చెప్పాడు,
"అమ్మా ! మీరు చేసిన పాప పుణ్యాల ననుసరించి స్వర్గ సుఖాలను , నరక యాతనలను
రెండింటిని అనుభవించాలి .మీరు ముందు ఎక్కడకు వెళతారో ఎన్నిక చేసుకోవచ్చు .
దానికి ముందు మీరు స్వర్గం , నరకం రెంటిలోనూ ఒక్కోరోజు గడపాలి "
కాంతిమతి ముందు నరకం చూస్తానంది. యమభటులు వచ్చి ఆమెను సాదరంగా
నరకానికి తీసుకెళ్ళారు .
నరకంలో , ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది .చాలా శుభ్రం గా ఉంది .
బాగా అలంకరించబడి ఉంది . ఆమె రాగానే పూర్వం ఆమెతో కలిసి పని చేసిన వారు ,
ఆమె పాత బాసులు ఘన స్వాగతం పలికారు . చక్కటి భోజనం పెట్టారు . ఆటా -పాటా
బాగా సాగింది . కాంతిమతి రోజల్లా ఆ సంబరాల్లో మునిగిపోయింది .
తరువాత రోజు ఉదయాన్నే , యమభటులు ఆమెను స్వర్గం లో ప్రవేశ పెట్టారు .
స్వర్గం చాలా ప్రశాంతం గా ఉంది ,ఆహ్లాదం గా ఉంది .రోజు ఎలా గడిచిందో తెలియలేదు .
పక్కరోజు ఉదయాన్నే దేవదూత అడిగాడు ,
" మీరు ఎక్కడికి ముందు వెళతారు "
కాంతిమతి ఒక్క క్షణం ఆలోచించి చెప్పింది ,
" నేను ముందు నరకానికే వెళతాను ,నా వాళ్లందరూ నా గురించి ఎదురు చూస్తుంటారు "
ఆమెని నరకానికి పంపారు ,
అడుగు పెడుతూనే భరించరాని దుర్గంధం,అంతా కుళ్ళిన చెత్త ,మనుషులంతా మహా మడ్డిగా
ఉన్నారు.
కాంతిమతి బుర్ర తిరిగిపోయింది .అక్కడ తనకు తెలిసిన వారిలో పెద్ద వారిని అడిగింది ,ఏమిటీ
తేడా అని . ఆ పెద్దాయన చెప్పారు ,
"మొన్న నిన్ను ఉద్యోగం లోకి తీసుకొన్నాము , ఇవాళ నువ్వు పనిలోకి వచ్చావు "
చివరి కోరిక
మృత్యుంజయరావు అప్పటికి ఆసుపత్రిలో జేరి పదవ రోజు. తనకు ఎంతో ఇష్టమైన తెల్ల బొచ్చు
కుక్క పిల్ల "డెవిల్" ముద్దుగా కరవటాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితమిది .డాక్టర్ వచ్చి నెమ్మదిగా
చెప్పాడు ,
" మీకు రాబిస్ బాగా ముదిరిపోయింది.మీరు ... ఎక్కువకాలం ..... కష్టం "
రావు ఓ రెండు నిమిషాలు మౌనంగా ఉండి, అడిగారు ,
"నాకు కొన్ని తెల్ల కాగితాలు , కలము ఏర్పాటు చేయగలరా ? "
"మీ వీలునామా రాయటానికా ? " అడిగాడు డాక్టర్
"లేదు , నేను ఎవరెవరిని కరవాలో మరచి పోకుండా ,లెక్క రాసుకుందామని " చెప్పారు
రావు .
ఎంతెంత దూరం
బాలకృష్ణ కొత్తగా రంగులేసే పనిలో చేరాడు.అతనికి నేషనల్ హైవే పై మధ్యలో తెల్ల గీతలు
గీసే పని అప్పచెప్పారు . బాలూ మంచి హుషారుగా పని మొదలు పెట్టాడు.
మొదటి రోజు పది కిలోమీటర్లు తెల్ల గీత గీసాడు . రెండో రోజు ఆరు కిలోమీటర్లు గీశాడు .
మూడో రోజు పాపం మూడే . నాలుగో రోజు ఒక్క కిలో మీటర్ .
దాంతో చిర్రెత్తు కొచ్చి అతని మేస్త్రీ అరిచాడు , అడిగాడు ,
" అరే , బాలూ రోజు రోజుకి కిలో మీటర్లు పెరగాలి గానీ , తగ్గుతున్నాయి ఏమిటి ? "
" పెయింట్ డబ్బా రోజు రోజు కి బాగా దూరం గా ఉంటోంది సార్ " అమాయకంగా చెప్పాడు
బాలకృష్ణ.
పరువు
భిక్షపతి,కుబేరరావుల మధ్య శత్రుత్వం వారసత్వం గా వచ్చింది మూడు తరాలుగా .ఎదుటి వాడ్ని
వెధవని చేసే అవకాశం , ఏ చిన్నది దొరికినా ఎవరూవదిలేవారు కాదు .
ఒకరోజు కుబేరరావు మిత్రుడు గంగరాజు తో,ఆవేశంతో వూగిపోతు కోపంతో జేపురించిన మొహంతో
అన్నాడు ,
"ఆ త్రాస్టుడు భిక్షపతి మొన్న పది మందిలో నా పరువు మొత్తం గంగలో కలిపాడు.వాడు నా
కళ్ళకి జీవితం లో మళ్ళీ కనిపించటానికి వీల్లేదు "
"మరి మన ఆస్థాన గూండా వినయ్ కి కబురు చెయ్యనా ? "
"అక్కరలేదు,నేనే వాడికి కనపడకుండా ఊరొదిలి వెళ్ళిపోతున్నాను"చెప్పాడు కుబేర రావు
నిద్రా భంగం
పొద్దున్నే సురపతిరావు ,నళినీ కాంతం కృష్ణానది ఇసకలో నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు .
సురపతిరావు ,
" మా ఇంట్లో కొత్త గా,పక్క వాటా లోకి అద్దెకి దిగారే,రామనారాయణ ,వాళ్లు ఈ రోజు తెల్లారి
మూడు గంటలకు పెద్దగా ఆవలిస్తూ , సనుక్కుంటు, చిరాకుగా అరుచుకుంటున్నారు "
" నీకు మరి నిద్ర చెడిపోయిందా ? " అడిగాడు నళినీ కాంతం .
"లేదు , నేను దీక్షగా నా మృదంగం ప్రాక్టీసు చేసుకుంటున్నాను "
పని
రాజేష్ కి " బిగ్ బజార్ " లో ఉద్యోగం వచ్చింది . మొదటి రోజు ఉదయాన్నే టక్ చేసుకొని
టిప్ టాప్ గా తయారై వెళ్ళాడు .
అక్కడి మేనేజర్ కి విష్ చేసి వినయంగా నుంచున్నాడు. మేనేజర్ పాపారావు అతనికి ఓ
బూజు కర్ర చేతికి ఇచ్చి దులపమన్నాడు .
బూజు కర్ర ని చూసి అసహ్యంగా మొహం పెట్టి దూరం జరుగుతూ రాజేష్ ,
"నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేశాను " అన్నాడు ఇబ్బందిగా
"సారీ , రాజేష్ , ఆ విషయం నాకు తెలియదు , ఆ బూజు కర్ర ఇలా ఇవ్వు , ఎలా దులపాలో
నేర్పిస్తా " అన్నాడు మేనేజర్ పాపారావు .
పోటీ
బెజవాడ బీసెంట్ రోడ్ లో అర్జునరావు , శేషగిరిరావు అనే టైలర్స్ ఎదురు బొదురు షాపుల్లో
ప్రశాంతంగా ఎవరి ఖాతాదారులకు వాళ్లు చక్కటి బట్టలు కుట్టి ఇస్తూ ఉండేవారు .కానీ
ఏమొచ్చిందో,ఏమో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది .పోటీ విపరీతం గా పెరిగింది .
ఎదుటివాడు మన్ను కొట్టుకు పోవాలని , పోటీలు పడి ధరలు తగ్గించటం మొదలు పెట్టారు .
ఒకరోజు ,
తన షాపు తెరుస్తూ అర్జునరావు ఎదుటి షాపు వైపుకి చూశాడు .అతని కళ్లు
నమ్మలేనట్లు కదలకుండా ఉండిపోయాయి.శేషగిరి షాపు ముందు ఇలా బోర్డ్ రాసి ఉంది
" ఒక జత (ప్యాంటు,షర్టు ) కుట్టుకులీ యాభై రూపాయలు మాత్రమే "
తరువాత రోజు ,
అర్జునరావు షాపు ముందు బోర్డ్ ఇలా రాసి ఉంది ,
" యాభై రూపాయలకు కుట్టిన మీ బట్టలు చక్కగా సరి చేసి ఇవ్వబడును "
బాదం పప్పు
కోటేశ్వరరావు చాలా జాగ్రత్తగా బస్ నడుపుతున్నాడు.ఈసారి సంపూర్ణ దక్షిణ దేశ యాత్రలకు
అందరూ వృద్ధులే బయలు దేరారు. డ్రైవింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా , వాళ్ల సణుగుడు
తో చచ్చి పోతున్నాడు .ఇప్పటికి ఇది మూడో రోజు .ఇంకా పన్నెండు రోజులు గడవాలి .
నాలుగు రోడ్ల కూడలి లో మంచి ట్రాఫిక్ లో ఉండగా , ఎవరో వెనకనుండీ భుజం తట్టారు .
చూస్తే ఓ 80 ఏళ్ల ముసలావిడ,అతని చేతిలో బాదం పప్పులు పెట్టింది.బానే ఉంది అనుకుంటూ
ఒక్కొక్కటీ పంటి క్రింద నములుతూ బస్ నడుపుతున్నాడు డ్రైవర్ .
ఓ పావు గంట గడిచేసరికి,మళ్ళీ ఎవరో భుజం తట్టారు ,వెనక్కి తిరిగితే చేతినిండా బాదం పప్పు
పోశాడు ఓ డెబ్బై ఏళ్ల పెద్దాయన . ఇవాళ మన అదృష్టం బాగుందని , పప్పులు నములుతూ
బండి తోలాడు .
అలా ఆ రోజల్లా గడిచింది .దాదాపు ఓ ఇరవై సార్లు బాదం పప్పులు తిన్నాడతను.
రాత్రి బస దగ్గర ప్రయాణికులను ఆసక్తిగా అడిగాడు ,
" మీరు రోజల్లా నాకు బాదం పప్పులు పిలిచి మరీ పెట్టారు, మీరే తినచ్చు గదా ? "
పెద్దలు అందరూ ఒకే గొంతుతో చెప్పారు బృందగానం లా ,
"మాకు చాక్లెట్లు అంటే ఇష్టం,కానీ వాటిలోని బాదం పప్పు నమలటానికి మాకు పళ్ళు లేవు "
వినికిడి
డాక్టర్ సుబ్బారావు దగ్గరకి వచ్చాడు అంకాలరావు. తన బాధ చెప్పుకొన్నాడు ఇలా ,
"డాక్టర్ గారూ , ఈ మధ్య మా ఇంటావిడకి చెముడు వచ్చిందని అనుమానంగా ఉందండీ .
మీదగ్గరకి రమ్మంటే రానంటోంది.దానికి చిన్నప్పటి నుండీ కాస్త సిగ్గెక్కువ.నేనేటి చేయాలో
తమరు చెబితే "
"అయితే విను " అని డాక్టర్ అతనికి ఎలా పరిక్ష చేయాలో చెప్పాడు .అది విని ఇంటికి
వెళ్ళాడు అంకాలరావు.
మరునాడు పరిక్షా ఫలితాలు డాక్టర్ గారికి వివరించాడు ,
" మీరు చెప్పినట్లే మొదట ఇంటికెళ్ళ గానే గేటు దగ్గరనుండీ ప్రేమగా దాని పేరెట్టి పిలిచాను.
చుట్టుపక్కల ఇళ్ళ వాళ్లు బయటకొచ్చి వింతగా చూశారు గానీ అది బయటకి రాలేదు .
వరండా లో నిలబడి మళ్ళీ పిలిచాను , అయినా దానికి వినపడలేదు. హాలులో నిలబడి
ప్రేమగా పిలిచాను మళ్ళీ ,దానికి వినపడలేదు .వంటింట్లో ఉంది కదా అని అక్కడకెళ్ళి
పిలిచాను విసుగ్గా,అయినా లాభం లేదు.దగ్గర కెళ్ళి దాని చెవిలో అరిచాను. దాంతో అది
ఒక్క సారిగా వెనక్కి తిరిగి ,
" ఎందుకలా చెవికోసిన మేక లా నన్ను పేరెట్టి ఐదు సార్లు పిలిచావు ,నీకేం కావాలో
చెప్పచ్చు కదా " అంది .
ఏమి చేయాలో తమరు చెబితే "
మృగం
దామోదరం , శాంతకుమారి పెళ్లి చేసుకొని ఏడు ఏళ్ళు అయ్యింది. గొడవలు ప్యాసింజర్ బండి
స్థాయి నుండి రాజధానీ ఎక్స్ ప్రెస్ స్థాయి కి పెరిగాయి .
ఒక రోజు దామోదరం , శాంతకుమారి ల మధ్య గొడవ తారా స్థాయి కి చేరుకుంది .దామోదరం
పట్టరాని కోపం తో అరిచాడు ,
"ఇన్నాళ్ళు నువ్వు నాలోని మనిషినే చూశావు .నా సహనం చచ్చి పోయింది .ఇప్పుడు నాలోని
మృగాన్ని నిద్ర లేపుతున్నావు. ఇంతకింతా అనుభవిస్తావు "
" అయినా కుందేలుకి ఎవరు భయపడతారు ? " అని చీర విదిలించుకుంటూ అక్కడ నుండీ
వాక్ అవుట్ చేసింది శాంత కుమారి .
ఖర్చు
వినయ్ బుద్ధిగా ఆఫీసులో పని చేసుకుంటున్నాడు .ఇంతలో అతని మొబైల్ మోగింది .
"హలో ! వినయ్ గారేనా మాట్లాడేది "
" అవును "
" నా పేరు విజయ్ , నేను శభాష్ క్రెడిట్ కార్డ్స్ నుండీ మాట్లాడు తున్నాను "
"చెప్పండి "
" మీరు మీ క్రెడిట్ కార్డ్ మీద జరిగే లావాదేవీలు సరిగా గమనించుకొంటున్నారా ? "
" చూస్తున్నాను , ఇబ్బంది ఏమీ లేదు "
" ఇటీవల మీ కార్డ్ పై చేసే వ్యవహారాలు ఒక దానికి ఒకటి పొంతన లేకుండా రకరకాలుగా
ఉంటున్నాయి , గమనించారా ? "
" రెండు నెలల క్రితం నా కార్డ్ పోయింది "
" ఐ యాం సారీ ,మాకు వెంటనే తెలియ జేయాలని మీకు తెలుసు కదా ? "
" తెలీదు , అయినా ఫరవాలేదు, కార్డ్ తో మా ఆవిడ చేసే ఖర్చు కంటే దొంగ చాలా
తక్కువ ఖర్చే పెడుతున్నాడు "
దోపిడీ
గజదొంగ గంగులు శ్రీశైలం రహదారిపై మాటు వేశాడు.దూరంగా మినుకు మినుకు మంటున్న
కారు హెడ్ లైట్ల కాంతి దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి పొడుచుకు వచ్చింది .అనుకోని అవాంతరం తో
డ్రైవర్ బ్రేక్ కొట్టి కారు ఆపాడు.గంగులు ముందు సీట్ లో కూర్చొని ఉన్న ఓ భారీ శాల్తీని
బయటకి లాగి మెడమీద కత్తిపెట్టాడు .అతని అనుచరులు మిగిలిన వారి పని చూస్తున్నారు.
గంగులు : " నీ దగ్గర ఉన్నదంతా బయటకు తీయి "
"నేనెవరో తెలుసా , పార్లమెంటు మెంబర్ని "
"అలాగా సార్ ! , అయితే నా డబ్బులు మర్యాదగా నాకివ్వండి "
వాటా
నగరం లోనే పెద్ద ధనవంతుడు కనకారావు , తన ఒక్కగానొక్క కూతురు అలివేలు ని ,
వేంకటాచలపతి కి ఇచ్చి రంగ రంగవైభోగం గా వివాహం చేశాడు .
తన ఇంటికి మొదటి సారిగా వచ్చిన అల్లుడిని అన్ని మర్యాదలతో సత్కరించి ,
కనకారావు అన్నారు ,
" అల్లుడు గారూ , నాకు కొడుకైనా , అల్లుడైన మీరే .నేను ఈ రోజు నుండీ నా వ్యాపారంలో
మీకు సగం వాటా ఇస్తున్నాను .మీరు రోజూ మన ఫ్యాక్టరీ లకి వెళ్లి అక్కడ జరిగే పనులను
గమనిస్తూ ఉండండి "
"నాకు ఫ్యాక్టరీలు అంటే అస్సలు పడవు . మిషన్ల శబ్దాలు నేను అసలు భరించలేను "
"సరేనండీ , పోనీ మన సాఫ్ట్వేర్ ఆఫీసుకి వెళ్లి అక్కడి పనులను అజమాయిషీ చేయండి "
"నాకు సాఫ్ట్వేర్ ఆఫీసులంటే చచ్చేంత బోరు .కంప్యూటర్ వంక చూసుకుంటూ ,అన్ని గంటలు
కదలకుండా కూర్చోటం నా వల్ల కాదు "
" మరి , మీకోసం ఏ పని చేయాలి నేను ? "
" మామయ్యా గారూ ! నా వాటా మొత్తం మీరు కొనుక్కోండి , చాలు "
ఆరోపణ
నీటిపారుదల శాఖలో ఎప్పటిలాగే ప్రాజెక్ట్ ల విషయం లో అవినీతి వరదలైపారుతోంది. బొత్తిగా
అనుభవంలేని ఒకడు పొరపాటున దొరికిపోయాడు . తనని కాపాడమని ప్రధాన
కార్య నిర్వాహణాధికారి మధుసూధన్ ని కలిసి కొంత సమర్పించుకున్నాడు . అందరి ఖర్మ
కాలి ఈ విషయం ప్రత్యేక కోర్టు లో విచారణ జరుగుతోంది ,
ప్రభుత్వం తరుఫున లాయర్ ,మధుసూధన్ ని ప్రశ్నించాడు ,
"కేసు మాఫీ చేయటానికి మీరు ఇరయై లక్షలు తీసుకుంది నిజమేనా ? "
మధుసూధన్ నుండీ సమాధానం లేదు .అతను కిటికీ లో నుండీ బయటకు చూస్తున్నాడు .
" మీరు కేసు మాఫీ చేయటానికి ఇరయై లక్షలు తీసుకున్నది నిజమేనా ? " మళ్ళీ
అడిగాడు లాయర్ . సమాధానం లేదు .
అప్పుడు జడ్జ్ గారు,
"మధుసూదన్ ! మీరు ఇరయై లక్షలు తీసుకోన్నారా ? " అని అడిగారు ,కొంచెం అతనివైపు
వంగి
మధు ఉలిక్కిపడి ,
" జడ్జ్ గారూ! లాయరు అడిగేది మిమ్మల్ని కాదా ? " అన్నాడు
లాయర్ తెలివి
ముద్దాయి వీరయ్య కోర్టు బోనులో నిలబడి ఉన్నాడు .ఆది శేషుని హత్య చేశాడని అతనిపై
అభియోగం .ఆదిశేషు శవం దొరకలేదు ,కానీ వీరయ్యే హత్య చేసినట్లు బలమైన సాక్ష్యాలు
ఉన్నాయి .అతని లాయర్ నిజాయతీగా వాదించి ,వీరయ్య ని నిర్దోషిగా విడుదల చేయించాలని
చూస్తున్నాడు .
ఆ రోజు చివరి వాయిదా , లాయర్ జడ్జ్ గారితో ఇలా చెప్పాడు ,
" మీరు మరణించారని భావిస్తున్న ఆదిశేషు , సరిగ్గా రెండు నిమిషాల తరువాత , తూర్పు
వైపు తలుపు ద్వారా కోర్టు లోకి వస్తాడు, దయచేసి చూడండి "
ఈ ప్రకటన విని కోర్టు లోని వారు ఒక్క సారిగా నివ్వెరపోయి , ఆదిశేషు కోసం తూర్పు
ద్వారం వంక కళ్లు ఆర్పకుండా చూడసాగారు .రెండు నిమిషాలు అయిపోయాయి .
మరో రెండు నిమిషాలు గడిచాయి . ఏమీ జరగలేదు .
జడ్జ్ గారు కోపంగా లాయర్ ని చూసి "ఏం పరాచికాలాడుతున్నావా " అన్నారు .
లాయర్ " క్షమించాలి , నేను ఆదిశేషు వస్తాడని చెప్పగానే , మీరందరూ అతనికోసం
కళ్ళప్పగించి ఎదురుచూశారు.దాని వల్ల , మీ మనస్సులో అతను బతికే ఉన్నాడని
ఏ మూలో అనుమానం ఉంది . అందుచేత మీరు ముద్దాయిని అపరాధిగా భావించ
కూడదు "
జడ్జ్ ఓ పది నిమిషాలు బాగా ఆలోచించి వీరయ్య కి ఉరి శిక్ష ఖాయం చేసారు .
లాయర్ అడిగాడు వినయంగా,
" మీరు మీ మనసు మార్చు కొనక పోవటానికి కారణం ఏమిటి ? "
" వీరయ్య తన చూపు తలుపు వైపు అసలు తిప్పనే లేదు కాబట్టి " చెప్పారు
జడ్జ్
కంటి అద్దాలు
నాగ లోకంలో నాగ పంచమి సంబరాలు బాగా జరుగుతున్నాయి . కానీ కోడె తాచు తక్షకుడు
మాత్రం ఆనందంగా లేడు. అక్కడ జరిగేది ఏమీ అతనికి కనబడటం లేదు .క్రితం ఏడు కూడా
ఇలాగే గడిచి పోయింది .ఇన్నాళ్ళు చెప్పుకోవటానికి సిగ్గు పడి వైద్యుడి దగ్గరకి వెళ్ళలేదు .
ఇప్పుడు వెళ్ళకతప్పట్లేదు .
నాగధన్వంతరి వద్దకు వెళ్ళాడు .ఆయన కళ్లు పరీక్షించి మంచి కళ్ళద్దాలు రాసి ఇచ్చి
రెండు రోజులాగి మళ్ళీ కనపడమన్నాడు .
తక్షకుడు రెండు రోజుల తరువాత చాలా విచారంగా తల వేళ్ళాడేసుకొని వచ్చాడు .
ధన్వంతరి అడిగారు ,
"ఏమి తక్షకా ! ఏం అద్దాలు సరిగా లేవా ? "
"బాగానే ఉన్నాయి .ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నప్పటినుండీ నాకు చాలా బాధగా ఉంది "
" బాధా , ఎందుకు ? "
" నేను రెండేళ్ళ నుండీ ఓ బురద కొయ్య తో కాపురం చేస్తున్నానని తెలిసింది "
పాపం రవి
బుజ్జి పరిగెత్తుకుంటూ,పక్కింటి లోకి దూసుకెళ్ళింది."హరీ ,హరీ , ఎక్కడున్నావు ? "అంటూ
అన్ని గదుల్లోకి కలయతిరిగింది .ఇంతలో హరి ఇంట్లోకి వస్తూ కనిపించాడు .
"ఎక్కడికి వెళ్ళావ్ " అడిగింది బుజ్జి
"మీ ఇంటికే " చెప్పాడు హరి
" సరే , నీకు తెలుసా , మీ క్లాసు లో ఎత్తుగా ఉంటాడే ,ఆ రవి గాడు పాపం వికలాంగుడు
అయి పోయాడు "
" వాడికి ఏం జరిగింది ? " అడిగాడు హరి ఆతృతగా
" ఏమో నాకు తెలీదు ,ఇందాక మేము మా ఊరినుండీ బస్సు లో వస్తుంటే ,వాడు వికలాంగుల
సీట్ లో కూర్చొని కనబడ్డాడు .పాపం పలకరిద్దామంటే బస్సు బాగా రద్దీ గా ఉంది "
చెప్పింది ఆరేళ్ల బుజ్జి .
వంట
ఎదురింట్లో జరిగిన పుట్టినరోజు పార్టీకి వెళ్లి,ఇంటికి తిరిగి వచ్చారు రామానందం దంపతులు.
కిళ్ళీ నములుతూ రామానందం భార్య తో అన్నాడు ,
"ప్రమీల మొగాడై పుట్టాల్సింది , కర్మ కాలి ఆడదై పుట్టింది "
"అదేంటి అంత మాటన్నారు ?, పిల్ల మహాలక్ష్మి లా ఉంటుంది.అంతే కాక వాళ్ల కాలేజి
బ్యూటీ కూడా "
"నేను మాటకు కట్టుబడతాను "
"పడితే పడండి, కానీ కారణం చెప్పండి "
"పిల్ల వంట నల భీమపాకం లా అమోఘంగా చేస్తే , ఇంకేమంటారు ? "
పంపకం
నగరం లో ఒక గొప్ప ధనవంతుడు సేట్ అన్సారీ లాల్ హటాత్తుగా చనిపోయాడు.చివరి
కార్యక్రమాలు పూర్తి అయినాయి .
ఆ తరువాత ఆయనపిల్లలు మహేష్ , రజనీష్ ఇద్దరూ ఎవరికి నచ్చింది వారు తమదే అని
ప్రకటించుకోసాగారు .అది కొట్లాట దాకా వెళ్ళింది .
హత్య జరిగిన తరువాతే లాయర్ అవసరం అని నమ్మిన వాళ్ల బాబాయి, వాళ్ల గొడవల్ని
చూస్తూ ఉండిపోయాడు .
వాళ్లకి విసుగొచ్చి , చేవ చచ్చి చివరకు తమ లాయర్ బాబాయి దగ్గరికి చేరి పరిష్కారం
చుపించమన్నారు . ఆయన "నేను చెప్పింది మీరు వింటానంటే చెబుతాను "అన్నాడు .
మహేష్ ,రజనీష్ ఇద్దరూ అంగీకరించారు . ఆయన ఆలోచించి చెప్పారు ,
"మహేష్ ఆస్తిని వాటాలు వేసే పని నీది . మొదటగా తనకు ఏ వాటా కావాలో కోరుకునే
హక్కు రజనీష్ ది "
శంకరాభరణం
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానకచేరీ "త్యాగరాయ గాన సభ " లో అద్భుతంగా
జరిగింది. వారిని అభినందించటానికి ఓ పెద్దా మనిషి ,వారి కాళ్ళకి నమస్కారం చేసి
అన్నారు ,
" అయ్యా ! మీరు శంకరాభరణ రాగంలో పాడిన కీర్తన బ్రహ్మాండంగా ఉందండీ "
బాలమురళీకృష్ణ గారు
"నేను ఈ రోజు శంకరాభరణం లో పాడనే లేదు " అన్నారు
అది విని వచ్చినాయన ,
" నా పక్కన కూర్చున్నవాడు శంకరాభరణం అనే అన్నాడు ,బొత్తిగా కనీస సంగీత జ్ఞానం
లేని వాళ్లు ఈ సభలకి ఎందుకొస్తారో " అంటూ పక్కకి జారుకొన్నాడు .
అరువు బాధ
గడప మీద కూర్చొని అప్పుల అప్పారావు ,చుట్టూ మెట్లపై అతనికి అప్పులిచ్చిన వాళ్లు .
వాళ్ల చేతులలో అప్పు పత్రాలు .అన్ని చూపులు అప్పారావు పైనే ఉన్నాయి .
అప్పారావు పైకి చూసాడు , పక్కకి చూసాడు , చుట్టూ చూసాడు .ఒక పరి నిట్టూర్చాడు .
తలదించాడు.సాలోచనగా తల పైకెత్తాడు .ఒక్కసారిగా అరిచాడు
" ఇందుమూలముగా నేను అందరికి తెలియజేయునది ఏమంటే , ఈ అప్పుల వల్ల నేను
పడే బాధని , ఎవరైనా తన బాధగా చేసుకుంటే , వారికి నేను పది వేల రూపాయిలు
ఇస్తాను "
గుంపులోనుండీ రామారావు పైకి లేచాడు .అతను అప్పారావు కి ఐదువేలు అప్పు ఇచ్చాడు .
వడ్డీతో పెరిగి అది తొమ్మిది వేలు అయ్యింది నేటికి .పది వేలు వస్తే వెయ్యి అదనం అని
ఆశ పడి
" అప్పారావు! నేను నీ బాధంతా పడతానోయ్,ఇంతకీ పదివేలేక్కడ ? " అడిగాడు .
అప్పారావు శాంతంగా బదులిచ్చాడు
" ఇదే నా వైపు నుండీ నీ మొదటి బాధ "