సుఖం

*
ఆండాళ్ ,భర్త బతికున్నంత కాలం పట్టించుకొనలేదు .ఈ మధ్యనే పైకెళ్ళి పోయాడు శ్యామసుందరం. అప్పటి నుండీ ఆమెకు ,సుందరం లేని లోటు బాగా అనుభవం లోకి వచ్చింది.తను చేసిన తప్పులకు బాధ పడింది.ఎలాగైనా సుందరాన్ని క్షమించమని అడగాలనుకొంది. ఉగ్రానంద స్వామి వారి సహాయంతో సుందరం ఆత్మతో మాట్లాడ గలిగింది ,

" ఏవండీ, నేను ఆండాళ్ ని, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను,క్షమించండి.నాతో ఒక్కసారి మాట్లాడండి"

" చెప్పు ఆండాళ్ళు , ఎలా ఉన్నావు ? "

"మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ నాకు ఏమీ బాగా లేదు .మీరెలా ఉన్నారు ? "

"నేను బానే ఉన్నాను "

" ఇక్కడ ఉన్నప్పటి కంటే బాగున్నారా ? "

"నాకు ఇక్కడ చాలా బాగుంది "

" అంటే మీరు స్వర్గం లో ఉన్నారా ? "

" లేదు , నరకం అంధకూపం లో "

తాళం చెవి

*
అర్ధరాత్రి రెండు గంటలకు, డాక్టర్ పద్మనాభం ఇంటి సింహద్వారంను ఎవరో దబదబా కొడుతున్నారు. ఆవలిస్తూ తలుపు తీసాడు ఆయన. ఎదురుగా .............

" సార్! మాఅబ్బాయి మా ఇంటి తాళం చెవి మింగేసాడు.దాన్నిఎట్టాగైనా బయటకు తెప్పించండి" అన్నాడు ఓ పెద్దమనిషి తన కొడుకుని చూపిస్తూ బాధగా .

" ఎప్పుడు మింగేసాడు " అడిగాడు డాక్టర్

" ఓ పదిరోజుల క్రితం "

" అప్పుడు మింగితే ఇప్పుడు తీసుకొచ్చావేమిటి ? " కంగారు పడ్డాడు డాక్టర్ .

" రెండో తాళం చెవి పోయింది ఇవాళే , అందుకే ... " నసిగాడు పెద్ద మనిషి

హెల్మెట్

*
ఓ పని లేని తెలుగు టీవీ ఛానల్ వారు ఓ పరమ బిజీ గా ఉన్న చౌరాస్తా లో నిలుచుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న సింగినాదం ను చుట్టుముట్టి ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు ,

" ఒక మనిషి గాడిద పై కూర్చొని వెళుతుంటే ,హెల్మెట్ లేనందుకు అతన్ని ఆపుతారా ? లేదా ? "

" లేదు " చెప్పాడు సింగినాదం

" ఎందుకు ఆపరు ? " అడిగారు పని లేని ఛానల్ వారు

" ఎందుకంటే , నాలుగు చక్రాల బండి కి హెల్మెట్ అక్కర లేదు "

నిచ్చెన

*
" అమ్మా ,అమ్మా ! ఒక్కసారి పెరట్లోకి రా " అరుస్తూ వంటిట్లోకి పరిగెత్తుకొని వచ్చాడు బంటీ

" మళ్ళీ ఏం నాశనం చేశావు రా ? "

" అమ్మా , నా కాళ్ళకి అడ్డంపడి గోడకానించిన నిచ్చెన పడిపోయింది కింద "

" నాకు పని ఉంది. వెళ్లి నాన్న కి చెప్పు "

" నాన్నకి తెలుసమ్మా "

"తెలిసినాయన ఆయనే సరిగా పెట్టచ్చు కదా ? "

" నాన్న చూరు పట్టుకొని వెళ్ళాడుతున్నారమ్మా "

నాస్తికుడు

*
వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలో ఇద్దరు వయసు మళ్ళిన బిచ్చగాళ్ళు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు ,

" ఏరా అప్పిగా ! భిక్షం గారి ఇంటి సందు లోకి రావటం మానుకున్నావేరా ? "

" ఆ సందు మా కొత్త అల్లుడికి కట్నం క్రింద ఇచ్చాను. వాడే వస్తున్నాడు "

" సరే గానీ , మీ కొత్తల్లుడు పండగకి కూడా గుడి కాడికి రాడెందుకు ? "

" ఆడొట్టి నాస్తికుడు , గుడి కాడికి రాడు "

పరుగు

*
హైదరాబాద్ లుంబినీ పార్క్లో ఒక తెలుగు బ్లాగరు వేగంగా పరిగెడుతున్నాడు. అప్పుడే లోపలికి అడుగు పెట్టిన మరో బ్లాగరు అతన్ని ఆపి అడిగాడు ,

" ఎందుకు పరిగెడుతున్నారు ? "

" ఇద్దరు తెలుగు బ్లాగర్ల మధ్య పెద్ద కొట్లాట జరిగేట్టుఉంది. దాన్ని ఆపటానికి పరిగెడుతున్నాను "

" ఎవరు వాళ్ళు ? "

" ఒకటి నేను , రెండు నన్ను పట్టుకోవటానికి పరిగెడుతూ వస్తున్నాడే వాడు " అని మళ్ళీ పరుగు లంకించుకున్నాడు మొదటి బ్లాగరు .

ప్రేమ పెళ్లి

*
సుజాత బెడ్ కాఫీ తాగుతూ కైలాష్ తో అంది ,

" కే !, కొత్తగా పక్క ఫ్లాట్ లో దిగిన జంటది ప్రేమ పెళ్లి అనుకుంటా "

" అతని మొహం చూస్తే ఆ తప్పు చేసిన వాడిలా కనిపించలేదే "

" లేదు , నా దగ్గర సాక్ష్యం ఉంది "

" ఏమిటో అది "

" రాత్రి తోడుకని మజ్జిగ కోసం వెళితే, ఆ పిల్ల చలిలో అతని కోసం వేడి నీళ్ళు పెట్టి ,దగ్గర కూర్చొని
మరీ అంట్లు తోమిస్తోంది "

అమ్మాయి ఒప్పుకుంది

*
" అమ్మా ! కొత్త వంటవాడిని తెచ్చుకుందాం. రోజూఒకటే వంట తిని బోరు కొడుతోంది " తల్లి పక్కన చేరి అడిగింది అర్చన .

కాంతం ఆనందం తో అరిచింది ,

" ఏమండీ ! మనమ్మాయి పెళ్లి కి ఒప్పుకుంది. ఆ చేత్తోనే మైసూరు పాక్ కూడా కలియ బెట్టండి "

అన్యాయం

*
కీర్తన ఏదోగా ఉండటం చూసి కవిత అడిగింది ,

" ఏమైంది కీర్తీ ! బాగా డల్ గా ఉన్నావు ? "

"పరిస్థితులు చూస్తుంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే రాంబాబుకి అన్యాయం చెయ్యక తప్పేట్టు లేదు . అదే బాధ గా ఉంది . "

" ఏం జరిగిందే ? "

" మా వాళ్ళు నా పెళ్లి నిశ్చయం చేశారు రాంబాబు తోనే " కలవరపడింది కీర్తన .

పెళ్లి వద్దు

*
పరంధామయ్య గారు తన జీవితపు చివరి క్షణాలలో బుద్దిమంతుడైన తన ఏకైక పుత్రరత్నాన్ని పిలిచి చెప్పారు ,

" రామం ! నేను జీవితంలో చాలా తప్పులు చేశాను.అన్నింటికంటే పెద్దతప్పు పెళ్లి చేసుకోవటం.ఆ తప్పు నువ్వు ఎన్నటికీ చెయ్యకు "

" రెండోదా,మూడోదా నాన్నా ? " అడిగాడు సకలగుణాభిరామం.


జేబులో పది

*
పట్టణం లోని గొప్ప కోటీశ్వరుడు రత్నాకరంని ఇంటర్వ్యూ చేస్తున్నాడు " మీ " టీవీ ఛానల్ విలేఖరి ఏకదంతం .

" మీరు బందరు ఎలా వచ్చారు ? ,వ్యాపారం ఎలా మొదలు పెట్టారు ? "

" నేను నా 16 వ ఏటా నా కాళ్ళ మీద నేను నిలబడాలని ,ఇల్లు వదిలి దొరికిన రైలెక్కాను.చివరి స్టేషన్ బందరు కాబట్టి నన్ను ఇక్కడ దించేశారు .అప్పుడు నా వంటి మీద కట్టు బట్టలు ,చొక్కా జేబులో పది రూపాయిలు మాత్రం ఉన్నాయి " జ్ఞాపకాలను నెమరు వేసుకొంటూ ఒక్క క్షణం ఆగాడు రత్నం .

వెంటనే ఏకదంతం ,

" అయితే మరి మీరు ఆ పది రూపాయలను మొదటిగా ఏ వ్యాపారం లో పెట్టుబడి పెట్టారు ? " అడిగాడు ఆత్రంగా

" ఆ పది రూపాయలతో మా నాన్నకు ట్రంకాల్ చేసి వెంటనే డబ్బు పంపమని చెప్పాను "

పునర్జన్మ

ఇందిరా పార్క్ లో తన కోసం ఎదురుచూస్తున్న సుజన వైపు , ఎంతో భారంగా ,ఏదో కోల్పోయిన వాడిలా
అడుగులు వేసి నీరసంగా ఆమె పక్కన కూలబడ్డాడు సిద్ధార్ధ .

"ఏమైంది సిద్దూ ! అలా ఉన్నావు ? "

" నీకు పునర్జన్మల మీద నమ్మకం ఉందా సుజీ ? "

" ఉంది, అయినా ఎందుకలా అడిగావు ? "

" ఈ జన్మకి మనం ప్రేమికులు గానే మిగిలిపోతామనిపిస్తోంది.వచ్చే జన్మలోనైనా పెళ్లి చేసుకుందాం "

" సిద్దూ ! ఎందుకలా ? " కన్నీళ్ళు ఆపుకొంటూ అడిగింది సుజన

" క్రితం జన్మ లోని ప్రేయసితో నాలుగు రోజుల క్రితం నా నిశ్చితార్ధం జరిగింది " వివరించాడు సిద్దు.

మళ్ళీ తీపి

*
పెళ్లి రోజు సరదాగా భార్య సుజాతతో కలిసి బయలుదేరాడు పురుషోత్తం.నడుస్తుంటే పుల్లారెడ్డీ స్వీట్స్ కనిపించింది .

భార్యని అడిగాడు ప్రేమగా " ఇంకో బందరు లడ్డు తింటావా ? "

సుజాత అచ్చెరువొంది " ఇంకా ఒకటే తినలేదు , రెండోదేంటి ? " అంది

" నీ మతిమరుపు మండా , పెళ్ళైన కొత్తలో మొదటి లడ్డు ఇక్కడేగా ఇప్పించా నీకు " గుర్తుచేశాడు
పీనాసి పురుషోత్తం .

కారు కష్టాలు

సీతామహాలక్ష్మి చికాకు పడుతూ, భర్త అరవింద్ కి ఫోను చేసింది ,

"మన కారు వల్ల పక్కింటి పంకజం దగ్గర నా పరువు పోయింది.దాంతో
కలిసి సినిమాకు
వెళుతుంటే మధ్యలో ఆగి పోయింది "

" కారుకేమైయ్యింది ? "

" కార్బోరేటర్లో నీళ్ళున్నాయి "

"కార్బోరేటర్లో నీళ్ళు ఉండటమేమిటి ? వెటకారం, నిజం చెప్పు "

"నిజంగా నిజం ,నీళ్ళున్నాయి "

" సరే , నీకు తెలిసిచ్చావదు గానీ , నేను చూస్తా, కారేక్కడుంది " విసుగ్గా అరిచాడు అరవింద్

" మన ఇంటి రోడ్డు దాటి కుడి వైపు ముందు కెళితే సాగర్ రోడ్డు వస్తుందే, దాని పక్కనున్న చెరువులో "

దత్తత

ఎన్నో నిద్ర లేని నెలలు ,సంవత్సరాలు గడిపి, ఆగలేక తన డెబ్భై ఏళ్ల తల్లి సుందరమ్మని
అడిగాడు సుదర్శనం ,

"అమ్మా ! నాకు యాభై ఏళ్ళు .తమ్ముడికేమో నలభై, చెల్లికి 38.నాకు ,వాళ్లకి రూపంలో
పోలిక లేదు ,అలవాట్లలో కూడా లేదు .నన్నేమైనా దత్తత కి తీసుకున్నారా ? "

"నీ ఆరో ఏటా దత్తత జరిగింది.కానీ వెనక్కి పంపించేసారు ,భరించలేక నిన్ను" చెప్పింది
తల్లి బాధ పడుతూ .

పుణ్యం

*
చిత్రగుప్తుడు చిట్టా తిరగేసి ,తన ఎదురుగా ఉన్న మనిషిని అడిగాడు ,


"నిన్ను కొంత కాలమైనా స్వర్గానికి పంపటానికి నీ ఖాతా లో ఒక్క పుణ్యం

కూడా కనబడటం లేదు "


"లేదు సార్, నేను ఒక ముసలమ్మా ని రౌడీ బారి నుండీ కాపాడాను "


" నా రికార్డ్ లో లేదు ,వివరం చెప్పు "


"ఒక డెబ్బై ఏళ్ల ముసలమ్మ బాంక్ లో పించెను తీసుకొని వెళుతోంది ,

ఒక రౌడీ ఆమె ను కొట్టి డబ్బు లాక్కు పోతుంటే నేను అడ్డగించి వాడిని

కొట్టి ఆమె డబ్బు తిరిగి ఇప్పించాను ."


" ఇది ఎప్పుడు జరిగింది ? " ఆసక్తి గా అడిగాడు చిత్రగుప్తుడు

" ఒక పది నిమిషాల క్రితం "

సంగీత పాఠం

*
సరస్వతి విద్యార్ధులకు జంట స్వరాలు నేర్పుతోంది. ఇంతలో ఓ పెద్దాయన ఆమెని

కలిసి అడిగాడు ,

" మీరు నాకు తప్పకుండా సంగీతం నేర్పాలి .ఇంతవరకు నేర్చుకున్న చోట

ఆరేళ్ళైనా ఒక్క ముక్క నాకు అబ్బలేదు "

" ఎక్కడ నేర్చుకున్నారు ? "

" సామగానం సంగీత దగ్గర "

" అది ఒట్టి మూర్ఖురాలు .దాని పొట్ట కొస్తే అక్షరం ముక్క కనపడదు.అది పాడని

అపస్వరం లేదు.పాడిన సుస్వరం లేదు. ఇంతకీ ఏం చెప్పింది ? "

" మీ దగ్గరకు వెళ్ళమని చెప్పింది "

త్యాగమయి

*
నరమాంస భక్షకులు ఇద్దరు లొట్టలు వేసుకొంటూ భోజనం చేస్తున్నారు. అతిధిగా వచ్చినవాడు
తన మిత్రునితో ,

" నువ్వు చాలా అదృష్టవంతుడివి. వదిన వంట అద్భుతంగా వండుతుంది "

" నిజమే, కానీ తను ఇక లేదన్న విషయం గుర్తొస్తే నాకూ బాధగానే ఉంది " అన్నాడు
మిత్రుడు విస్తట్లోకి విచారంగా చూస్తూ .

ఈ పుస్తకం ఎంతో రుచి


*
తెలుగు వారి ఆహారచరిత్ర గురించి మీరు ఎప్పుడైనా,ఎక్కడైనా చదివారా ?

తరతరాల
తెలుగు వంటలు ఏమిటో ,అవి ఎలా చేయాలో, అవి

తినటం
వల్ల కలిగే లాభాలేమిటో మీకు తెలుసా ?

"తందూరి రోటి " తెలుగు వారిది ,నమ్మకం లేదా ? అయితే ,



మీరు
శ్రీ జి.వి.పూర్ణచంద్ గారి " తరతరాల తెలుగు రుచులు " చదవండి.
ఇంతకు
ముందు నేను రాసిన రెండు టపా లలోని తెలుగు వంటల విశేషాలు
దీని నుండే "చూచి రాత " రాసాను.

పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు. విదేశాల్లోని వారు ఇక్కడ నుండీ
కొనుక్కోవచ్చు .మన వారు ఎమెస్కో బుక్స్.కాం ( emescobooks.com ) నుండీ పొందవచ్చు

చెప్పుకోండి చూద్దాం - సమాధానాలు

* అందుచేత ,అందువలన నేను అందరి పప్పులు ఉడికాయని భావించి సమాధానాలు
చెప్పేస్తున్నా .

.చాపట్లు = ఫింగర్ రోల్స్ = అట్టు లోపల కూర పెట్టి చాపలా చుట్టి,చిన్న ముక్కలు చేసి
నూనెలో వేయించే వంటకం


.గంగ నురుగులు = తెల్ల నువ్వులు/ + సగ్గుబియ్యం కలిపి వడియాలు

.నీరొత్తిగలు = పేపర్ దోశలు /ఫేణీలు


.బజ్జులు = కూరగాయల్ని కాల్చి చేసిన పచ్చళ్ళు


.సారసత్తులు = జంతికలు


.ఇంచిమంచి = కాకా పట్టటం , లంచం ఇవ్వటం


.దూది మడుగులు = పూత రేకుల్లా మడిచి వండిన పూరీలను పాల కోవా లో ముంచి
తీసిన వంటకం, మాల్పువా -బెంగాలీ పేరు


.క్కెర = చెక్కెర /బెల్లం చేర్చి నెయ్యిలో వేయించిన బియ్యపు పిండి వంటకం,
సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా


.కరిజ = ఖజ్జికాయ


౧౦.నూటిడి = రుబ్బిన తెల్ల నువ్వుల పిండిలో లేత కొబ్బరి, దంచిన బెల్లం ,వేయించిన
శనగపప్పు పిండి కలిపి చేసిన వంటకం


పైవన్నీ (ఇంచిమంచి కాక ) మన బాగా పాత తరాల తెలుగువారు చేసుకొని , లొట్టలు
వేసుకుంటూ ఆరగించిన అచ్చ తెలుగు వంటకాలు .కొన్ని శ్రీనాధుల వారి కవిత్వం లో
మనకు కనిపిస్తాయి .

చెప్పుకోండి చూద్దాం

* కొన్ని తేట తెలుగు పదాలను ఇస్తున్నాను. అవి ఏమిటో, అర్ధాలేమిటో

చెప్పుకోండి చూద్దాం :

. చాపట్లు

. గంగ నురుగులు

. నీరోత్తిగలు

. బజ్జులు

.సారసత్తులు

.ఇంచిమంచి

.దూది మడుగులు

.ఉక్కెర

.కరిజ

౧౦. నూటిడి

ఎవరొస్తారు,ఎవరొస్తారు, ఎవరొస్తారో ......................................

అభియోగం

*
కోర్టు బోనులో తలవంచుకొని నిలబడిఉన్నాడు చిన్నారావు. జడ్జ్ గారు ప్రశ్నించారు,

"నువ్వు ,నీకు ఐదువేలు అప్పు ఇచ్చిన భీమారావు ని ఆరో అంతస్తు లోని నీ అపార్ట్మెంట్ రోడ్డు

వైపు కిటికీ గుండా కిందకి తోసేశావని నీమీద అభియోగం .నువ్వు చెప్పుకోనేదేమన్నా ఉందా? "

"కావాలని చెయ్యలేదు .అనుకోకుండా జరిగిపోయింది "

" అది సరి కాదు. అలా చేసేటప్పుడు కనీసం ఆలోచన ఉండద్దూ, అప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్లకి
ఎంత అపాయమో "

కలలో క్రికెట్

*
సన్యాసిరావు, మానసిక వైద్యుడు చిదానందం దగ్గర కి వచ్చి తన బాధ చెప్పుకొన్నాడు ,

"డాక్టర్ గారూ ! నాకు నెల రోజుల నుండీ రోజూ అడవి పందులు క్రికెట్ ఆడుతున్నట్లు
కలలోస్తున్నాయి. దీని నుంచీ బయట పడటం ఎలా ? " అని తల పట్టుకొన్నాడు .

చిదానందం టాబ్లెట్లు రాసిచ్చి రాత్రి భోజనం తరువాత వేసుకోమన్నాడు .

" ఈ టాబ్లెట్లు రేపటి నుంచీ వేసుకుంటాను " చెప్పాడు సన్యాసి రావు.

" ఈ రోజే మొదలు పెట్టచ్చు గదా ? "

" ఈ రాత్రి ఫైనల్ మ్యాచ్ ఉంది " నసిగాడు స. రావు

వీరభద్రం వచ్చాడు

*
ఊరు"మునిపల్లె. దానికి దక్షిణంలో అడవి. ఉత్తరంలో కొండలు. ఊర్లో ఉన్న చిన్న హోటల్
యజమాని భీమారావు ,కొత్తగా పనిలో చేరిన సీనయ్య తో చెబుతున్నాడు ,

"ఊరి వాళ్ళు మంచివాళ్ళు. ఇబ్బంది పెట్టరు. అయితే ఒకటే ఇబ్బంది .అడవిలో వీరభద్రం అనే
దుర్మార్గుడు ఉన్నాడు. వాడిది భయంకరాకారం.వాడికి నచ్చనివాడు బతికి ఉండడు.వాడు ఊళ్ళోకి
వస్తున్నాడంటే ,నువ్వు పారిపోయి కొండలలో దాక్కో.మర్చిపోకు "

సీనయ్య తల వూపాడు.

ఓ నెల గడిచింది. ఓ రోజు"వీరభద్రం వస్తున్నాడు, పారిపొండీ"అంటూ గొర్రెల కాపరి గోపాలం అరుస్తూ కొండ వైపు పరిగెత్తాడు.

సీనయ్య భయంతో వెంటనే పరుగులు తీసాడు.ఊరివాళ్ళు కంగారుగా ,భయంతో పరిగెడుతుంటే ,
వాళ్ళ కాళ్ళ మధ్య నలిగి ఓ పక్కగా హోటల్ గోడ వెనుక నక్కి వణుకుతున్నాడు.

కొద్ది సేపటికి ఓ భీకరాకారుడు పెద్ద పెద్ద అంగలతో హోటల్ వైపుకి వచ్చి ,సీనయ్య ని చూసి
"ఓ ప్లేటు ఇడ్లీ పట్టుకురా " అని అరిచాడు . అతి కష్టం మీద సీనయ్య వణుకుతున్న చేతులతో
వాడికి ఇడ్లీ అందించాడు. వాడిని మంచి చేసుకుందామని "మీకు ఇంకేమన్నా కావాలా "
అని భయంగానే అడిగాడు .

చింత నిప్పులలాంటి కళ్ళతో సీనయ్యని గుచ్చి చూస్తూ వాడు ,

"అంత సమయం లేదు .వీరభద్రం వస్తున్నాడు ,పారిపోవాలి " అంటూ డబ్బులిచ్చి వేగంగా
కదిలాడు .

బంగారు భూమి

*
బంగారుభూమి రియల్ ఎస్టేట్ ఆఫీసు ఏడో అంతస్తు లోని సీనియర్ మేనేజర్ సింగరాజు గదిలోకి
కంగారు పడుతూ వచ్చాడు కొత్త సేల్స్ మాన్ శీనుబాబు.

"సార్ ,మన గోవిందా వెంచర్ ఒకటి లో 57 నంబర్ ఫ్లాట్ కొన్న పార్టీ తను కట్టిన డిపోజిట్
తిరిగిమ్మని గొడవ చేస్తున్నాడు. వినలేని బూతులు తిడుతున్నాడు.డబ్బు తిరిగి ఇచ్చేయ్యనా ? "


" ఏంటి ప్రోబ్లం "

"మన ఫ్లాట్ లో చెరువు ఉందిట సార్ "

" నువ్వేం సేల్స్ మాన్ వయ్యా .పోయి అతనికి ఒక పడవైనా అమ్ము లేదా పక్క ఫ్లాట్ అయినా
అమ్ము .ఇప్పుడున్న దాన్ని స్విమ్మింగ్ పూల్ చేసుకునేట్లు వప్పించు "

లాయర్ సంపాదన

ఇద్దరు లాయర్లు కోర్టు క్యాంటిన్ లో టీ తాగుతూ మాట్లాడు కొంటున్నారు .

"రామూ ! నీ మొదటి సంపాదన ఎంత ? "

" ముష్టి ఐదువేలు ,మా సీనియర్ పార్టీ దగ్గర పాతిక వేలు నొక్కేసి ,నాకు ఐదు వేలు పడేసాడు .
మరి నీకురా చలపతీ ? "

" నేను నా మొదటి కేసు తో, నా మేనమామ దగ్గర చదువు కోసం తీసుకొన్న లక్ష బాకీ తీర్చేసాను "

" మొదటి కేసే గొప్పది కొట్టేసావు ,ఆ కేసు గురించి చెప్పరా "

" అప్పు తీర్చలేదని మామయ్య నా మీద కేసు వేసాడు ,దాంతో మొత్తం కట్టాల్సివచ్చింది "

కారెక్కు త్వరగా

*
కుమారస్వామి రెండు రోజులు ఫాం హౌస్ లో ఖుషీ చేసుకొని,నగరం దోవ పట్టాడు తన కారు లో. రోడ్డు ఎక్కే సరికి, అవతలి వైపు అరటి తోటల దగ్గర నుండీ ఓ కుర్రాడు చేతిలో అరటి పళ్ళతో పరిగెత్తుకొని వస్తున్నాడు. అతని వెనుక ఆరు కోతులు పరిగెడుతున్నాయి. అతను వేగంగా పరిగెడుతున్నాడు .అవి మరింత వేగంగా అతన్ని వెంబడిస్తున్నాయి

స్వామికి అతన్ని చూసి జాలేసి ,కారు పక్కన ఆపి డోర్ తెరిచి పట్టుకొని గట్టిగా పిలిచాడు ,

"బాబూ ! తొందరగా రా ,కారెక్కు త్వరగా "

కుర్రాడు రొప్పుతూ వచ్చి కుమారస్వామి చేయి పట్టుకొని పది సార్లు " నెనర్లు ,నెనర్లు " అన్నాడు .

ఆయన "ఈ పాటి సాయానికి అంతగా చెప్పాలా " అన్నాడు .

అప్పుడు కుర్రాడు వినయంగా పలికాడు ,

" అయ్యా ! మీరు కాబట్టి నాకు , నా ఆరు కోతులకు లిఫ్ట్ ఇస్తున్నారు .ఉదయం నుంచీ
ఎదురు చూస్తున్నాను.ఒక్క వెధవా లిఫ్ట్ ఇచ్చి చావలేదు "

భానుమతి బొలెరో

యస్.వి.రంగారావుగారు మోజుపడి మరీ బుకింగ్ చేసుకొన్నటాటా నానో,ఆరు నెలలకువారింటికి చేరింది.ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఆజనేయ స్వామి కోవెల లో ముప్పై బొట్లు పెట్టి,మూడు కొబ్బరికాయలు కొట్టి పూజ చేయించి రోడ్డు ఎక్కారు డ్రైవ్ చేస్తూ .

అంతలో భానుమతి గారి బొలెరో, కొత్త కారుని పలకరించటానికి అన్నట్లు రాసుకుంటూ
ముందుకు దూసుకెళ్ళింది. రంగారావు గారు పిచ్చ కోపం తో ఊగిపోతూ స్పీడుగా కారుని పోనిచ్చి బొలెరో కి అడ్డంగా ఆపారు .భానుమతిని క్రిందకి దిగమని గర్జించి ,బొలెరో చుట్టూ తన కాలి చెప్పుతో వలయం చుట్టి ,"దీంట్లో నుండీ బయటకి అడుగు పెడితే ఉర్కోను " అని హెచ్చరించారు.

తన జేబు లోంచి నెయిల్ కట్టర్ తీసి ,కసిగా బొలెరో సీట్లు కోసేసి " నీ తప్పు కి చెల్లు కొట్టా చూసావా ? " అంటూ వికటంగా నవ్వారు భానుమతిని చూస్తూ .

"నేను నీ గీత దాటి నా కుడి కాలు నాలుగు సార్లు బయట పెట్టాను , నువ్వు చూడలేదుగా "
అంది నవ్వుతూ భానుమతి , ఆయన మాటల్ని కరివేపాకులా తీసేస్తూ


మీరు మంచి ప్రచురణకర్త కావాలనుకుంటున్నారా ?

ప్రచురణ రంగంలో తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే వారి కోసం నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు,విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారితో కలిసి ఈ నెల 17 వ తేదీ నుండీ 29 వ తేదీ వరకు రెండు వారాలపాటు శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది .ఈ శిక్షణా తరగతులలో ఎడిటింగ్ ,ప్రొడక్షన్ ,మార్కెటింగ్ ,సేల్స్ ప్రమోషన్ ,ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ ,ఫైనాన్స్ మరియు కాపీ రైట్స్ మొదలైన విషయాలపై లోతైన అవగాహన,ఈ రంగం లో ప్రసిద్ధులైన వారిచే అందజేయబడుతుంది .ఆసక్తి కలవారు ఈ నెల 12 వ తేదీ లోగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆఫీసు లో 50 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి .కోర్స్ ఫీజు 1000 రూపాయలు.తరగతులు విజయవాడ లో నిర్వహించబడతాయి.

వివరాలకు సంప్రదించండి : 0866-2570843,2573354 /www.nbtindia.org.in

పేషెంట్

*
హెల్దీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నుండీ భీమారావు ,ఇదు నిమిషాలలో ఆపరేషన్
జరగబోతుండగా పరిగెత్తుకొని బయటకు వస్తూ సిస్టర్ కుతూహలమ్మ కంట పడ్డాడు.
అతన్ని ఆపి ,

"ఎందుకు పారిపోతున్నావు ?, ఆపరేషన్ అంటే అంత భయమా ? " అని అడిగింది .

"సిస్టర్ సుబ్బమ్మ చెప్పింది ,చిన్నాపరేషనే, భయపడనక్కరలేదు అని " రొప్పుతూ
చెప్పాడు భీమారావు .

"మరి ఇంకేం , భయం వద్దు , పద లోపలికి ,డాక్టర్ గారు ఎదురుచూస్తున్నారు "

"సుబ్బమ్మ చెప్పింది నాకు కాదు ,డాక్టర్ గారికి "అని మళ్ళీ పరుగు మొదలు పెట్టాడు
భీమారావు

వాచ్ మాన్

*
ఒక సహకార బ్యాంక్ వారు నైట్ వాచ్ మాన్ కోసం న్యూస్ పేపర్ లో ప్రకటన ఇచ్చారు .
ఆ రాత్రే దొంగలు పడి డబ్బు , లాకర్లన్నీ దోచుకెళ్ళారు .ఆ తరువాత రోజు బ్యాంకు
అధికారులు ఉద్యోగం కోసం వచ్చిన తిరుపతయ్యని ఇంటర్వ్యూ చేసారు,

"నువ్వు నైట్ వాచ్ మాన్ ఉద్యోగానికి పనికివస్తావని ఎలా చెప్పగలవు? "

"చీమ చిటుక్కు మన్నా నాకు వెంటనే నిద్ర మెలుకువ వచ్చేస్తుంది సార్ "
జవాబిచ్చాడు తిరుపతయ్య .

బ్లాగు రాతలు

*

బ్లాగు రాతలు

నీటి మూటలు

నెట్ మునిగిన

పోవునన్నా