వీరభద్రం వచ్చాడు

*
ఊరు"మునిపల్లె. దానికి దక్షిణంలో అడవి. ఉత్తరంలో కొండలు. ఊర్లో ఉన్న చిన్న హోటల్
యజమాని భీమారావు ,కొత్తగా పనిలో చేరిన సీనయ్య తో చెబుతున్నాడు ,

"ఊరి వాళ్ళు మంచివాళ్ళు. ఇబ్బంది పెట్టరు. అయితే ఒకటే ఇబ్బంది .అడవిలో వీరభద్రం అనే
దుర్మార్గుడు ఉన్నాడు. వాడిది భయంకరాకారం.వాడికి నచ్చనివాడు బతికి ఉండడు.వాడు ఊళ్ళోకి
వస్తున్నాడంటే ,నువ్వు పారిపోయి కొండలలో దాక్కో.మర్చిపోకు "

సీనయ్య తల వూపాడు.

ఓ నెల గడిచింది. ఓ రోజు"వీరభద్రం వస్తున్నాడు, పారిపొండీ"అంటూ గొర్రెల కాపరి గోపాలం అరుస్తూ కొండ వైపు పరిగెత్తాడు.

సీనయ్య భయంతో వెంటనే పరుగులు తీసాడు.ఊరివాళ్ళు కంగారుగా ,భయంతో పరిగెడుతుంటే ,
వాళ్ళ కాళ్ళ మధ్య నలిగి ఓ పక్కగా హోటల్ గోడ వెనుక నక్కి వణుకుతున్నాడు.

కొద్ది సేపటికి ఓ భీకరాకారుడు పెద్ద పెద్ద అంగలతో హోటల్ వైపుకి వచ్చి ,సీనయ్య ని చూసి
"ఓ ప్లేటు ఇడ్లీ పట్టుకురా " అని అరిచాడు . అతి కష్టం మీద సీనయ్య వణుకుతున్న చేతులతో
వాడికి ఇడ్లీ అందించాడు. వాడిని మంచి చేసుకుందామని "మీకు ఇంకేమన్నా కావాలా "
అని భయంగానే అడిగాడు .

చింత నిప్పులలాంటి కళ్ళతో సీనయ్యని గుచ్చి చూస్తూ వాడు ,

"అంత సమయం లేదు .వీరభద్రం వస్తున్నాడు ,పారిపోవాలి " అంటూ డబ్బులిచ్చి వేగంగా
కదిలాడు .

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం