తెల్లగోడ

*
మహర్షి సదానందుల వారి ఆశ్రమం . ఈ మధ్యనే ఆశ్రమం లోని గోడలకు తెల్ల సున్నం వెల్ల
వేయించారు . వారికి ఇద్దరు శిష్యులు .ఒకరు శుకుడు ,అతనిది జ్ఞాన మార్గం .
మరొకరు రామదాసు, భక్తి మార్గానుయాయి .

ఒకరోజు ఉదయాన్నే శుకుడు ఆశ్రమం లోని తెల్లని గోడపై " సోహం " (అదే నేను ) అని
బొగ్గు తో రాసాడు . కాసేపటి తరువాత ఆ దారిన వెళుతున్న రామదాసు సోహం ముందు
"దా " కలిపాడు బొగ్గుతో .దాంతో ఆమాట " దాసోహం "(భగవంతునికి దాసుడను ) అయ్యింది .
ఆ తరువాత శుకుడు " స " కలిపాడు . ఈ సారి తన వంతుగా రామదాసు " దా " కలిపాడు .
అలా శుకుడు " స " ని , రామదాసు "దా " ని కలుపుతూ వెళ్ళారు . వారు బొగ్గు తో కొత్త
అక్షరం కలిపిన ప్రతిసారీ కొత్త కొత్త పదాలు , కొత్త అర్ధాలు పుట్టుకొచ్చాయి .

అవి :" సోహం " ,"దాసోహం " ," సదా సోహం " ," దాస దాసోహం ", సదా సదా సోహం ".

ఈ విషయాన్ని అంతా గమనించిన సదానందుల వారు ,శిష్యులిద్దరినీ పిలిచి చెప్పారు ,


"నాయన లారా , మీ పోటీలతో మీరు మసిబొగ్గుతో తెల్లని గోడని ఎందుకు పాడు చేస్తారు ?,
మీ మనసు మలినాలు అంటని తెల్లని గోడ లా ఉంటే ఏ మార్గమైనా మంచిదే .అలా కాక
మసిబొగ్గు పూసిన గోడలాగా ఉంటే అందులో జ్ఞానం గానీ , భక్తిగానీ ఏవీ నిలువవు "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం